రాయచూరు రూరల్: నగరంలో హడపద అప్పణ్ణ జయంతిని ఆచరించారు. మంగళవారం బసవేశ్వర సర్కిల్లో జిల్లా పంచాయతీ, జిల్లాధికార యంత్రాంగం, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖ, హడపద అప్పణ్ణ సమాజం ఆధ్వర్యంలో హడపద అప్పణ్ణ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పణ్ణ చిత్రపటానికి అదనపు జిల్లాధికారి శివానంద పూలమాల వేశారు. అధికారులు మాట్లాడుతూ సమాజం అభివృద్ధికి విద్య ప్రధానమని అన్నారు. హడపద అప్పణ్ణ మార్గదర్శనంలో నడవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ వర్మ, శరణప్ప తదితరులు పాల్గొన్నారు.
సొంతంగా రోడ్డు
మరమ్మతులకు శ్రీకారం
రాయచూరు రూరల్: సిరవారలో గుంతలు పడి అధ్వాన స్థితికి చేరుకున్న లింగసూగూరు–రాయచూరు జాతీయ రహదారి మరమ్మతులకు శ్రీకారం చుట్టిన ఘటన జరిగింది. మంగళవారం రైతు అమరేష్ చాగబావి బుల్డోజర్ సాయంతో గుంతలు పడ్డ రహదారిలో రాళ్లు, ఎర్రమట్టిని కలిపి వేసి మరమ్మతులు చేశారు. రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని మాజీ మంత్రి బోసురాజు, మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్, అధికారులకు పలు మార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో సొంత ఖర్చులతో రెండు కి.మీ.ల మేర రహదారికి మరమ్మతులు చేపట్టారు.
ఎడమ కాలువలో
గేజ్ పాటించాలి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ చివరి ఆయకట్టు భూములకు సక్రమంగా నీరందాలంటే గేజ్ను పాటించాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో సంచాలకులు శంకర గౌడ మాట్లాడారు. మైల్ నంబర్–69 వద్ద నీటి నిర్వహణ గేజ్ సామర్థ్యాన్ని గురించి జిల్లాధికారికి వివరించినా ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదన్నారు. గేజ్ నిర్వహణలో జరిగిన లోపంతో కింది భాగానికి నీరందడం కష్టంగా మారిందన్నారు. 69వ మైలు పైభాగంలో దాదాపు 2 లక్షల ఎకరాల వరకు అక్రమంగా నాన్ ఆయకట్టు సాగులో ఉందని, దాన్ని తొలగిస్తే ఆయకట్టు చివరి భూముులకు నీరు అందుతాయన్నారు. మంత్రి, శాసన సభ్యుల మధ్య రైతులు నష్ట పోతున్నారన్నారు.
కురుబలకు అన్యాయం తగదు
హుబ్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కురుబ కులానికి తగిన ప్రాతినిథ్యం లభించక పోవడం అత్యంత విచారకరం, అదే అసంతృప్తికి కారణం అయిందని రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు సిద్దన్న తేజి తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ కురుబ వర్గం రాష్ట్రంలో అతిపెద్ద బీసీ కులాలలో ఒకటి. కాంగ్రెస్ పార్టీ సంఘటితానికి, ఎన్నికల్లో గెలుపునకు కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అయినా మంత్రివర్గ విస్తరణలో తమ వర్గానికి ఆశించిన మేర పదవులు ఇవ్వలేదు. ప్రత్యేకించి ఉత్తర కర్ణాటక కురుబ ప్రజాప్రతినిధులకు అవకాశం దొరకక పోవడం సామాజిక మనోభావాలను కుంగదీసిందన్నారు. అంతేగాక మంత్రి పదవికి గాయత్రి పేరు ప్రకటించాక స్వస్తి చెప్పారన్న వార్తలు తమ వర్గాలకు తీరని నిరాశ కలిగించాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, పార్టీ పెద్దలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ వర్గాల జనాభాకు అనుగుణంగా మంత్రివర్గంలో కనీసం 5 పదవులు ఇవ్వాల్సింది. కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించడం న్యాయ సమ్మతం కాదు. ఖాళీగా ఉన్న మంత్రి పదవిని గాయత్రి శాంతేగౌడకు లేదా ఈ ప్రాంత కురుబలలో అర్హులైన ఎమ్మెల్యేకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయ సమ్మతమైన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే చైతన్య కార్యక్రమాల ద్వారా సమాజాన్ని సంఘటితం చేస్తామని, అంతేగాక ప్రజాస్వామ్యం ద్వారా తమ సత్తా చాటుతామని హెచ్చరించారు.


