మైసూరు: మైసూరు జయనగర సమీపంలోని కోర్టులో అన్ని విరోధాలను మరిచి భార్యాభర్తలు మళ్లీ ఒక్కటైన భావోద్వేగ క్షణాలకు జాతీయ లోక్ అదాలత్ సాక్ష్యంగా నిలిచింది. కుటుంబ న్యాయస్థానం ప్రాంగణంలో విడాకుల కోసం దాఖలు చేసిన 36 జంటలు విచారణకు వచ్చాయి. ప్రధాన జిల్లా, సెషన్స్ జడ్జి ఉషారాణి వారితో మాట్లాడారు. క్రిమినల్ కేసుల విచారణలో నిందితులు చాలా మందికి తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్నారు. విడాకుల కారణంగా, ఒంటరి తల్లిదండ్రులకు పిల్లలపై శ్రద్ధ పెట్టడం కష్టమవుతుంది. అప్పుడు వారు దారి తప్పుతారు. అందువల్ల దంపతులు ఓపికగా ఉండి, చిన్న చిన్న సమస్యలను తామే పరిష్కరించుకోవాలి అని వివరించారు. కుటుంబ న్యాయస్థానం జడ్జి సావిత్రి కుజి మాట్లాడుతూ, ‘విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న దంపతులు, అదాలత్లో తమ మనసు మార్చుకుని ఒక్కటయ్యారు’ అని తెలిపారు. పిల్లల ప్రయోజనాల కోసం చాలా మంది ఏకమవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. న్యాయమూర్తులు పెద్దల స్థానంలో నిలబడి కుటుంబాలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లోకేష్ అన్నారు. విడాకులను నివారించడం ప్రశంసనీయమని తెలిపారు. చివరకు 36 జంటలు మళ్లీ కలిసిపోయారు. జడ్జిలు మిఠాయిలు తెప్పించి వారిచేత తినిపించడం ఆప్యాయతకు అద్దం పట్టింది.
9 వేల కేసుల పరిష్కారం
లోక్ అదాలత్లో 9,939 కేసులు పరిష్కారమయ్యాయి. ఒకటిన్నర నెలలుగా దీనిపై కష్టపడినట్లు జడ్జిలు, వకీళ్లు తెలిపారు. కుటుంబ న్యాయస్థానాలలో 161 కేసులు పరిష్కరించబడ్డాయి. తదుపరి అదాలత్ సెప్టెంబర్లో జరుగుతుందని జడ్జి ఉషారాణి తెలిపారు. నాగరాజప్ప సిద్దప్ప అంకాసదొడ్డి, శరణబసప్ప కెంబవి, ఇస్రత్ జహాన్ ఆరా, దివ్య పాల్గొన్నారు.
మైసూరు లోక్ అదాలత్లో
మళ్లీ ఒక్కటైన 36 జంటలు
జడ్జిలు, వకీళ్ల కృషి


