వైభవంగా వాల్మీకి విగ్రహ ఊరేగింపు
బళ్లారిఅర్బన్: నగరంలోని ఎస్పీ సర్కిల్ అభివృద్ధిలో భాగంగా జనవరి 3న మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు కోట ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి వాల్మీకి మహర్షి వాల్మీకి విగ్రహాన్ని 1008 కలశాలు, బ్యాండు వాయిద్యాలు, కళా బృందాల నృత్యాలతో పూర్ణకుంభ కలశాలతో అంగరంగ వైభవంగా బసవనకుంట రోడ్డు మీదుగా ఎస్పీ సర్కిల్ వరకు వేలాది మంది వాల్మీకులు, స్థానికుల సమక్షంలో ఊరేగింపు నిర్వహించారు. నగర కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, కాంగ్రెస్ ప్రముఖులు రాంప్రసాద్, సిద్దమ్మనహళ్లి తిమ్మనగౌడ, బోయపాటి విష్ణు, చానాళ్ శేఖర్, హగరి జగన్నాథ్, యర్రగుడి ముదిమల్లయ్య, సంగనకల్లు విజయ్కుమార్, బీజేపీ మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప, వీకే బసప్ప, వాల్మీకి బాంధవులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జనవరి 3న జరగనున్న వాల్మీకి విగ్రహ కుంభాభిషేకానికి రాజనహళ్లి వాల్మీకి పీఠాధిపతి ప్రసన్నానందపురి, మంత్రులు సతీష్ జార్కిహోళి, జమీర్ అహ్మద్ ఖాన్, మాజీ మంత్రులు బీ.నాగేంద్ర, కేఎం.రాజన్నలతో పాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సయ్యద్ నాసీర్ హుస్సేన్, కంప్లి ఎమ్మెల్యే గణేష్ తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు.


