
బైక్ తగిలిందని కారుతో ఢీకొట్టారు
●యువకుడి మృతి
దొడ్డబళ్లాపురం: బైక్ రాసుకుంటూ వెళ్లిందనే కోపంతో కారుతో ఢీకొట్టగా యువకుడు మృతి చెందాడు. ఈఘటన బెంగళూరు విద్యారణ్యపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మహేశ్ అనే వ్యక్తి స్నేహితులు బాలాజీ,నిఖిల్తో కలిసి బైక్పై వెళ్తుండగా పక్కనే వెళ్తున్న కారును తాకుకుంటూ వెళ్లింది. దీంతో కారులో ఉన్న అరవింద్, కేశవ్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్ను కారుతో వేగంగా వచ్చి ఢీకొన్నారు. మహేశ్ అక్కడికక్కడే మృతిచెందగా బాలాజీ, నిఖిల్ గాయపడ్డారు. విద్యారణ్యపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
జైలు వద్ద దర్శన్ అభిమాని హల్చల్
దొడ్డబళ్లాపురం: హీరో దర్శన్ ఎటువంటి తప్పు చేయలేదని, ఆయనను తక్షణం విడదల చేయాలని డిమాండ్ చేస్తూ అభిమాని ఒకరు పరప్పన అగ్రహార జైలు ముందు గురువారం హల్చల్ చేశాడు. కరనాడ యువసేన అధ్యక్షుడైన రవికుమార్ తన మెడలో దర్శన్ ఫొటో వేసుకుని జైలు వద్ద పొర్లు దండాలు పెట్టి టెంకాయలు కొట్టడం ప్రారంభించాడు. రవికుమార్ చర్యలతో పోలీసులు అవాక్కయ్యారు.అనంతరం తేరుకున్న పోలీసులు రవికుమార్ను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
బస్సులో విద్యార్థినికి ఆస్వస్థత
●నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లిన డ్రైవర్
బొమ్మనహళ్లి : బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థిని అస్వస్థతకు గురవ్వడంతో డ్రైవర్ నేరుగా వాహనాన్ని అస్పత్రికి తీసుకెళ్లి బాధితురాలికి చికిత్స చేయించాడు. ఈఘటన ఉడుపిలో చోటు చేసుకుంది. మంగళూరు–మణిపాల్ మధ్య సంచరించే ఎకేఎంఎస్ ప్రైవేటు బస్సులో ఓ విద్యార్థిని ఉడుపి వెళ్లేందుకు మూల్కిలో బస్సు ఎక్కింది. కటవాడి దాటిన తర్వాత విద్యార్థిని అస్వస్థతకు గురైంది. డ్రైవర్ నసీఫ్ గమనించి బస్సును ఉడుపిలోని టీఎంఏ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఆ విద్యార్థినిని ఆస్పత్రిలోకి తరలించారు. సరైన సమయంలో విద్యార్థినిని తీసుకురావడంతో ప్రాణాపాయం నుంచి బయట పడినట్లు వైద్యులు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్ నసీప్, కండక్టర్ మోహిత్ను ప్రయాణికులు అభినందించారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
శివమొగ్గ: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని హొళెహొన్నూరు సమీపంలోని జంబరఘట్ట గ్రామంలో జరిగింది. హెచ్ఎన్ శరత్(26) గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ ద్వారం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నగరంలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. హొళెహొన్నూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఎమ్మెల్యే కుమారుని హత్యకు కుట్ర
శివమొగ్గ: జిల్లాలోని భద్రావతి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేశ్వర్ కుమారుడు బసవేశ్ హత్యకు జైలు నుంచే కుట్ర పన్నిన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనపై భద్రావతి ఓల్డ్ టౌన్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ కేసులో శిక్ష పడి జైలులో ఉన్న భద్రావతికి చెందిన ఓ నిందితుడు ఇతరులతో కలిసి హత్యకు పథకం రూపొందించినట్లు తెలిసింది. ఇటీవల హత్యకు సుపారీ తీసుకున్న ఓ నిందితుడు ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో బసవేశ్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్యే కుమారుడి హత్యకు కుట్ర పన్నడానికి కారణమేంటి? అనే అంశం దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలియవచ్చింది.
ఎమ్మెల్సీ ఇంటిపై రాళ్ల దాడి
దొడ్డబళ్లాపురం: కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ ఐవాన్ డిసౌజా ఇంటిపై దుండగులు రాళ్లు రువ్వారు. గవర్నర్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళూరులో ధర్నా చేపట్టిన సందర్భంలో డిసోజా మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ప్రధానికి పట్టిన గతే గవర్నర్కు పడుతుందని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు డిసౌజాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఐవాన్ డిసోజా ఇంటిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. కిటికీ గ్లాస్లు, ఇంటి ముందు పూల కుండీలు ధ్వంసమయ్యాయి. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.రాళ్ల దాడి చేసిన వారు తలకు హెల్మెట్లు వేసుకుని వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

బైక్ తగిలిందని కారుతో ఢీకొట్టారు