చెట్ల నరికివేతతోనే చేటు!  | Supreme Court Slams Illegal Logging Amid North India Floods | Viral Real Pushpa Scene Video Cited | Sakshi
Sakshi News home page

చెట్ల నరికివేతతోనే చేటు! 

Sep 4 2025 1:02 PM | Updated on Sep 5 2025 5:24 AM

Supreme Court Key Comments On North India Floods Details

వరద విలయానికి కారణమిదే 

వృక్షాల నరికివేత అరికట్టండి 

ఏం చేస్తారో వివరణ ఇవ్వండి 

కేంద్రం సహా వరద బాధిత రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: వరద విలయంలో తరచూ ఉత్తరాది రాష్ట్రాలు చిక్కుకుపోతున్న ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేసింది. విపరీతంగా, విచ్చలవిడిగా వృక్షాలను నేలకూల్చడమే ఈ ప్రకృతివినాశనానికి అసలు కారణమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. 

వరద నీటిని బలంగా ఎదుర్కొనే భారీ వృక్షాలను విపరీతంగా నరికేయడం వల్లే వరదల ప్రభావం అత్యధిక స్థాయిలో ఉంటోందని, చెట్ల అక్రమ నరికివేత పర్వానికి ఇకనైనా ముగింపు పలకాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వరదల బారినపడి అవస్థలు పడుతున్న హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, పంజాబ్‌ ప్రభుత్వాలతోపాటు కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పులు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.

 చెట్ల నరికివేతను అడ్డుకునేలా ఏమేం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ సంజాయిషీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో కొండచరియలు విరిగిపడటం, వరదల విలయం సర్వసాధారణంగా మారిన విషయం తెల్సిందే. దీంతో కొండప్రాంతాల్లో చెట్ల అక్రమ నరికివేత కారణంగానే వరద ప్రభావం అధికమైందని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయాలంటూ అనామికా రాణా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారణచేపట్టింది.

 ఈ సందర్భంగా వరద విలయంపై కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్‌లో కొండచరియలు పడటం, వరదల వార్తలు మనందరం చూస్తూనే ఉన్నాం. వరద నీటిలో ఎన్నడూలేనంతటి భారీ స్థాయిలో పెద్ద దుంగలు కొట్టుకుపోవడం మీడియా కథనాల్లో గమనించాం. ఇన్ని దుంగలు ఎక్కడి నుంచి కొట్టుకొస్తున్నాయి? అక్రమంగా భారీ చెట్లను నరికివేసి ప్రకృతి విలయానికి కారణమవుతున్నారు. ఈ విషయంలో బాధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తక్షణం స్పందించాల్సిందే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  

సీరియస్‌గా తీసుకోండి 
వేరే కేసు విచారణ నిమిత్తం అదే కోర్టు హాల్‌లో ఉన్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్రం తగు చర్యలు తీసుకునేలా చూడాలని ఆయనను ఆదేశించింది. ‘‘ ఇది చాలా తీవ్రమైన అంశం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ప్రధానంగా దృష్టిసారించాలి. చెట్లను నరికేస్తుండటంతో ఆ దుంగలన్నీ వరద ప్రవాహంలో దిగువకు కొట్టుకొస్తున్నాయి. పంజాబ్‌లో వరదనష్టానికి సంబంధించిన ఫొటోలను చూశాం. లక్షల ఎకరాల్లో పంట పాడైంది. కొండప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాల్సిందే. కానీ పర్యావరణం పాడవకుండా అభివృద్ధిని సుసాధ్యంచేయాలి. 

పర్యావరణానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూడాలి’’ అని మెహతాకు కోర్టు సూచించింది. దీంతో మెహతా స్పందించారు. ‘‘ ప్రకృతితో మనం అనవసరంగా అతిగా జోక్యం చేసుకున్నాం. అందుకే  ప్రకృతి మన విషయాల్లోనూ జోక్యం చేసుకుంటోంది. ఇలాంటి విలయాలను సాధ్యమైనంతమేరకు నివారించేందుకు ప్రయతి్నస్తాం. ఈరోజే నేను కేంద్ర పర్యావరణ మంత్రికి విషయాన్ని వివరిస్తా. బాధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతోనూ మాట్లాడతా’’ అని మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు. 

పిటిషనర్‌ అనామికా రాణా తరఫున న్యాయవాదులు ఆకాశ్‌ వశిష్ట, శుభం ఉపాధ్యాయ్‌ వాదించారు. ‘‘ఆకస్మిక వరదల కారణంగా కొందరు సొరంగమార్గాల వద్ద చిక్కుకుపోతున్నారు. మరికొందరి పరిస్థితి ప్రాణసంకటంగా మారింది. ఈ అంశంలో ప్రభుత్వాలు వెంటనే కార్యాచరణతో ముందుకురావాలి. విపత్తులు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. బాధిత పౌరులకు నష్టపరిహారం, పునరావాసం, సాయం అందించాలి’’ అని న్యాయవాదులు వాదించారు. వీరి వాదనలపై కోర్టు స్పందించింది. సీరియస్‌ విషయం కాబట్టే ఈ కేసును మరో రెండువారాల్లో మళ్లీ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement