డిజిటల్ అరెస్టులు.. ఆన్లైన్ స్కాములు నిత్యం వింటున్నాం. ఆన్లైన్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే ఏం చేస్తారు? ఎక్కడైనా ఫిర్యాదు చేస్తారు లేదా ఆ సైట్లోకి వెళ్లడం మానేస్తారు. అయితే ఒక యువకుడు ఈ తరహా స్కామ్ను ఏఐ చాట్ జీపీటీ పవర్తో తిప్పికొట్టాడు. తనను మోసం చేయాలని చూసిన స్కామర్ను ట్రాక్ చేసి, అతని వివరాలు సేకరించి, చివరకు ‘నన్ను వదిలేయండి.. మహా ప్రభో’ అని వేడుకునేలా చేశాడు. ఈ ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
ఢిల్లీకి చెందిన ఒక యువకుడు ఆన్లైన్ మోసగాడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. తన కాలేజీ సీనియర్గా, ఐఏఎస్ అధికారిగా చెప్పుకున్న ఒక స్కామర్ తక్కువ ధరలకు ఫర్నిచర్ అమ్ముతున్నానని చెబుతూ, డబ్బు కొట్టేయాలని ప్రయత్నించాడు. ఈ మెసేజ్లో ఏదో తేడా ఉందని గ్రహించిన బాధితుడు, ఈ స్కామర్ను టెక్నాలజీ సాయంతో ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారాన్ని ఒక ఏఐ ఆధారిత ఆపరేషన్గా మార్చి, చివరకు ఆ స్కామర్ను తన ట్రాప్లో పడేలా చేశాడు. ఇందుకోసం ఆ యువకుడు చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు.

స్కామర్కు నగదు పంపడానికి వీలుగా, చెల్లుబాటు అయ్యే విధంగా ఒక నకిలీ చెల్లింపు పోర్టల్ను రూపొందించాలని ఏఐకి ఆదేశించాడు. అయితే, ఈ వెబ్పేజీ ముఖ్య ఉద్దేశ్యం డబ్బు స్వీకరించడం కాదు.. అది క్లిక్ చేసిన వారి జియో లొకేషన్, ఐపీ అడ్రస్, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరాతో వారి ఫొటోను రహస్యంగా సంగ్రహించడం. ఏఐ కొద్ది నిమిషాల్లోనే ఈ మోడల్కు అవసరమైన కోడ్ను రూపొందించింది. ఇది ఆన్లైన్ దొంగను పట్టుకోవడానికి వేసిన ఒక తెలివైన డిజిటల్ వలగా మారింది.
ట్రాకర్ పేజీ సిద్ధమైన తర్వాత బాధితుడు స్కామర్కు ఆ లింక్ను పంపాడు. క్యూఆర్ కోడ్ను అప్లోడ్ చేయడం ద్వారా చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయవచ్చని నమ్మబలికాడు. అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో స్కామర్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ లింక్పై క్లిక్ చేశాడు. అంతే ఆ నకిలీ పోర్టల్కు స్కామర్ ఉంటున్న ఖచ్చితమైన స్థానం, ఐపీ అడ్రస్, స్పష్టంగా' ఉన్న అతని సెల్ఫీ అందాయి. వెంటనే బాధితుడు ఆ వివరాలను తిరిగి స్కామర్కే పంపడంతో కథ ఊహించని మలుపు తిరిగింది.
తన వివరాలు బయటపడటంతో స్కామర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే, వేర్వేరు నంబర్ల నుండి బాధితుడికి పదేపదే కాల్స్ చేసి.. ఈ పనిని ఇకపై చేయను అంటూ క్షమాపణలు కోరడం మొదలుపెట్టాడు. ఆ యువకుడు షేర్ చేసిన స్క్రీన్షాట్లు చూసి స్కామర్ వణికిపోయాడు. ఈ మొత్తం వ్యవహారం గురించి సదరు యువకుడు ‘రెడిట్’లో పోస్ట్ చేస్తూ, చివర్లో.. ‘దొంగను బోల్తా కొట్టించడంలో ఆ తృప్తే వేరు’ అని వ్యాఖ్యానించాడు. ఈ ఘటన సైబర్ మోసాలను ఎదుర్కోవడంలో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో నిరూపించింది.
ఇది కూడా చదవండి: అమ్మకానికి పాక్ ఎయిర్లైన్స్.. గుంటనక్క చేతికే!


