సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ భారీగా విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచే 19 విమాన సర్వీసులతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వివిధ గమ్యస్థానాల నుంచి రావల్సిన 21 విమానాలను ఇండిగో సంస్థ పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.
నిర్వహణ సమస్యలతోనే ఈ అంతరాయం కలిగిందని తెలుస్తోంది. సర్వీసుల రద్దుపై ఎయిర్లైన్స్ సంస్థ ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ప్రయాణికులు ఎయిర్పోర్టు దాకా వచ్చి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు సంబంధిత ఎయిర్లైన్స్ నుంచి ముందస్తు సమాచారం తీసుకుని తమ ప్రయాణాలను నిర్ణయించుకోవాలని ఎయిర్పోర్టు నిర్వాహకులు సూచిస్తున్నారు.
కారణాలేంటంటే..
అతిపెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించడం, మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, చెన్నై, హుబ్లీ, భోపాల్, భువనేశ్వర్ ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. వారు సోషల్ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ముఖ్యమైన సమావేశాలు వెళ్లలేకపోతున్నామని, ఇండిగో సిబ్బంది తగిన సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు.
ఇండిగో సంస్థ దేశంలో 2,200 విమానాలను నడిపిస్తోంది. మంగళవారం 1,400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. బుధవారం 200 విమానాలు రద్దయ్యాయి. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, రద్దీ, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు, ప్రతికూల వాతావరణం వంటివీ విమానాల రద్దుకు కారణాలుగా నిలిచాయి. ఈ పరిస్థితికి కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(ఎఫ్డీటీఎల్) నిబంధనల్లో సవరణ చేయడమేనని ఇండిగో వర్గాలు చెబుతున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు, ఇతర సిబ్బందికి మరింత ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా పైలట్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. దాంతో అనివార్యంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, విమానాలు ఎయిర్పోర్టులకే పరిమితం అయ్యాయని అంటున్నారు. కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక లోపాలతో చెక్–ఇన్ వ్యవస్థలు సరిగా పనిచేయలేదు. కౌంటర్ల ముందు ప్రయాణికులు బారులు తీరారు.
ఏంటా కొత్త రూల్స్.. ?
FDTL కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. వాటి ప్రకారం.. రాత్రి సమయంలో (రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు) డ్యూటీ గంటలు తగ్గించబడ్డాయి. వరుసగా ఎక్కువ గంటలు పని చేయకుండా, మధ్యలో ఎక్కువ విరామం తప్పనిసరి. కేబిన్ సిబ్బందికి ల్యాండింగ్స్ పరిమితం చేశారు. 11 గంటల డ్యూటీలో గరిష్టంగా 6 ల్యాండింగ్స్ మాత్రమే ఉండాలి. అలాగే.. 11.30 గంటల డ్యూటీలో గరిష్టంగా 5 ల్యాండింగ్స్ ఉండాలి. ఇక14 గంటల డ్యూటీలో (9 గంటల ఫ్లైయింగ్) కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి ఏటా పైలట్లు, సిబ్బందికి ఫాటిగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పైలట్లు, సిబ్బంది అలసట లేకుండా పని చేయడం, అలాగే ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే రోస్టరింగ్ సిస్టమ్ మార్పులతో.. ఎయిర్లైన్స్ తమ షెడ్యూల్లను కొత్త నియమాలకు అనుగుణంగా మార్చుకోవాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా రాత్రిపూట నడిపించే విమానాలు, అధిక ఫ్రీక్వెన్సీ రూట్లలో అంతరాయానికి దారి తీస్తోంది.

ఇలాగే ఇంకొన్ని గంటలు
రెండు రోజులుగా తమ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని, వారిని క్షమాపణ కోరుతున్నామని ఇండిగో యాజమా న్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్లో మార్పులతోపాటు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. మరో 48 గంటలపాటు ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనలను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఇటీవలే జారీ చేశారు. విమాన సిబ్బంది రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని ఆదేశించారు. 24 గంటల్లో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, స్పైస్జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. మానవ వనరుల నిర్వహణలో ఇండిగో విఫలమైందని, అందుకే విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(అల్పా) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
IndiGo provided the following summary of recent operational performance - A total of 1,232 flights were cancelled during the period. A large share of cancellations arose from crew / FDTL compliance and airport/airspace/ATC-related factors, many of which lie beyond the operator’s… pic.twitter.com/9v7pReqZAH
— ANI (@ANI) December 3, 2025
దర్యాప్తునకు ఆదేశం
ఇండిగో ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ బుధవారం ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమిటో తెలియజేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే విమాన సేవలను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారోర చెప్పాలని సూచించినట్లు వివరించారు.


