
ఏకాంతంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో ఆందోళనకు గురైన యువతీ యువకుడు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు.
బనశంకరి: ఏకాంతంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో ఆందోళనకు గురైన యువతీ యువకుడు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన దావణగెరె నగరంలో చోటుచేసుకుంది.
వివరాలు... ఆలూరట్టి తాండాకు చెందిన రతన్ (20), జగళూరు తాలూకాకు చెందిన యువతి దావణగెరె కాలేజీలో డిగ్రీ బీకాం రెండవ ఏడాది విద్యార్థులు. ఇద్దరూ ప్రేమించుకున్నట్లు తెలిసింది. 2 నెలల కిందట కాలేజీ పైన ఇద్దరూ ఏకాంతంగా ఉండడాన్ని గమనించి వారికి తెలియకుండా ఎవరో మొబైల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది స్థానికంగా సోషల్ మీడియాతో పాటు ఇంటర్నెట్లోని కొన్ని వెబ్సైట్లలో బాగా ప్రసారమైంది.
మొదట యువతి బలవన్మరణం
ఇది తెలిసి యువతి ఇంట్లో ఏమంటారోనని భయాందోళనకు గురై, శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణవార్త తెలుసుకుని రతన్ హాస్టల్ నుంచి సొంతూరు ఆలూరట్టి తాండాకు చేరుకుని రాత్రికి ఉరివేసుకుని తనువు చాలించాడు. పిల్లలను కోల్పోయిన కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై ఇద్దరి తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేసి ఘోరానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్న జిల్లా ఎస్పీ అరుణ్ తెలిపారు.