నియోజకవర్గాల వారీగా నోటీసులు అందనున్న ఓటర్ల సంఖ్య
కరీంనగర్అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ జోరందుకుంది. ఇప్పటికే ఈ నెల 10నుంచి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా సదరు ప్రక్రియ ఆలస్యం కాగా సోమవారం నుంచి వేగవంతం చేశారు. ఓటర్ల జాబితాలో పేరు లేనివారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వగా 18 ఏళ్లు నిండినవారు కూడా దరఖాస్తు ఇవ్వొచ్చు. ఓటర్ల జాబితాను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్దేశించగా తదనుగుణ చర్యలు షురువయ్యాయి. కలెక్టర్ చిత్రామిశ్రా నిశిత పరిశీలన చేపడుతుండగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా ఓటర్లకు నోటీసులు జారీ చేసేందుకు యుద్ధప్రతిపాదికన చర్యలు చేపడుతున్నారు.
నోటీస్లో కారణం ప్రదర్శన.. 13 రకాల పత్రాల్లో ఏదున్నా అర్హతే
పోలింగ్ బూత్ వారీగా నోటీసులు జారీ చేస్తుండగా సదరు నోటీసులో ఎందుకు నోటీస్ ఇస్తున్నారో స్ప ష్టంగా పేర్కొన్నారు. సంబంధిత పత్రాలతో నోటీస్లో ఉన్న తేదీన ఓటరు హాజరుకావాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. ఓటరు నమోదు అర్హతను ని రూపించే అవసరమైన పత్రాల జాబితాను క్రోడీకరించారు. జనన ధ్రువీకరణ, పాత ఓటరు జాబితా, నివాసం, కుటుంబ సంబంధిత పత్రాలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఐడీ లేదా పెన్షన్ పత్రం, పాస్పోర్ట్, అటవీ హక్కుల ధ్రువీకరణ పత్రం, 1987కు ముందు ప్రభుత్వం, స్థానిక అధికార యంత్రాంగం, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసీ, ప్రభుత్వరంగ సంస్థల ద్వారా జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు, విద్యార్హత ధృవీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, రాష్ట్ర, స్థానిక అధికారులతో తయారుచేయబడిన కుటుంబ రిజిష్టర్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి, ఇంటి కే టాయింపు ధ్రువీకరణ పత్రం ఇందులో ఏ ఒక్కటి ఉన్న అందజేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
27న గ్రామ/వార్డు సభలు
సర్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. పట్టణాల్లో వార్డు సభలు, గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయనుండగా ఏఎస్డీ(ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్) జాబితా బూత్స్థాయి అధికారులు, సూపర్వైజర్ల సమక్షంలో చదివి వినిపించనున్నారు. దాంతో పాటు ఫారం–6,7,8 అందుబాటులో ఉంచనుండగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే అప్పటికప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. అనామోలీస్(ఓటర్ల వివరాలలో లోపం), మ్యాపింగ్ కానీ(పాత, ప్రస్తుత రికార్డులో లేనివారు) ఓటర్లకు సంబంధించిన వివరాలు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు బీఎల్వోలు అందించనున్నారు.
సర్కు ముందు జిల్లా
మొత్తం ఓటర్లు: 10,89,090
సర్ ముసాయిదా జాబితా ప్రకారం
ఓటర్లు: 9,11,933
నోటీసులు ఇవ్వనున్న
ఓటర్ల సంఖ్య: 1,77,157
ఫిర్యాదులు, అభ్యంతరాలు:
ఈ నెల 10 నుంచి సెప్టెంబర్ 9వరకు
నోటీసుల జారీ, పరిశీలన: ఈ నెల 10 నుంచి
తుది ఓటరు జాబితా: అక్టోబర్ 12, 2026
కరీంనగర్: 1,00,618, చొప్పదండి: 28,626
మానకొండూరు: 19,668
హుజూరాబాద్: 28,245


