వేములవాడ: ఉపాధి కోసం యూఏఈ (అబుదాబీ) వెళ్లాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధనలతో షాకిచ్చింది. వీసాల కోసం ఇకపై విధిగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనతో ఆ దేశం వెళ్లే ప్రతిఒక్కరిపై అదనంగా దాదాపు రూ.11 వేల నుంచి రూ. 12 వేల వరకు ఆర్థిక భారం పడనుంది. వీసా ప్రక్రియ కూడా నెలరోజులు ఆలస్యమవుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్లాట్ లభించక ఇబ్బంది పడుతున్నారు.
పీసీసీ ఎలా తీసుకోవాలి..?
● పాస్పోర్ట్ పొందే విధానంలో పీసీసీని తీసుకోవాల్సి ఉంటుంది.
● ఆన్లైన్ సెంటర్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి.
● కేటాయించిన తేదీన పాస్పోర్ట్ కేంద్రానికి వెళ్లి వచ్చిన తర్వాత పోలీస్ విచారణ ఉంటుంది.
● ప్రక్రియ పూర్తయిన తర్వాత వారం పది రోజుల్లో పీసీసీ సర్టిఫికెట్ చేతికి వస్తుంది.
● ఈ ప్రక్రియకు అధికారికంగా రూ.500 ఫీజు ఉంటే మీ సేవ కేంద్రం నిర్వాహకులు మరో రూ.500వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
అటెస్టేషన్ ఖర్చులే అదనం
పీసీసీ సర్టిఫికెట్ వచ్చినంత మాత్రాన సరిపోదు. అసలైన ఖర్చంతా ఇక్కడే మొదలవుతుంది. దేశంలోని యూఏఈ ఎంబసీ కౌన్సులేట్ కేంద్రాలైన హైదరాబాద్, త్రివేండ్రం లేదా ఢిల్లీలలో ఏదో ఒక చోట ఈ సర్టిఫికెట్పై తప్పనిసరిగా ధ్రువీకరణ చేయించాల్సి ఉంటుంది. ఈ అటెస్టేషన్ ప్రక్రియకు 300 దిర్హామ్ల వరకు ఖర్చవుతుందని గల్ఫ్ ప్రతినిధులు చెబుతున్నారు. మొత్తంగా రూ.12 వేల అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ఫీజులు, రానుపోను ప్రయాణ ఖర్చులు, ఎంబసీ అటెస్టేషన్ ఫీజులన్నీ కలుపుకొంటే ఒక్కొక్కరిపై దాదాపు రూ. 11 వేల నుంచి రూ.12 వేలు వరకు అదనపు భారం పడుతోంది. పైగా ఈ కొత్త రూల్ వల్ల వీసాలు చేతికి అందడానికి అదనంగా నెల రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది నిరుద్యోగ గల్ఫ్ కార్మికులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా ‘పీసీసీ’ నిబంధన
అదనంగా రూ.12 వేల భారం
వీసాల జారీ మరో నెల ఆలస్యం
యువతపై ఆర్థిక భారం.. ఆపై తిప్పలు


