● రెండు రోజులపాటు బస్సుల కొరత
● బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తున్న వైనం
జగిత్యాలటౌన్: ఖమ్మంలో శుక్రవారం జరిగే సీఎం రేవంత్రెడ్డి సభకు ఆర్టీసీ జగిత్యాల డిపో నుంచి 40 బస్సులను వివిధ ప్రాంతాలకు తరలించారు. దీంతో జగిత్యాల బస్టాండ్లో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సుల కొరత కారణంగా గురువారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అడపదడపా వచ్చిన బస్సుల్లో ఎక్కేందుకు జనం ఎగబడ్డారు. ప్లాట్ ఫాంకు వచ్చిన బస్సుల్లోకి ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పార్టీలు, ప్రభుత్వం నిర్వహించే సభలకు ఆర్టీసీ బస్సులను తరలించడం షరా మామూలుగా మారిందని, ప్రతీసారి ఇదే ఇబ్బంది ఎదురవుతోందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగే సభకు గురువారమే బస్సులు తరలించడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే నిలిచిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సీఎం సభ పేరుతో ఉన్న కొద్ది బస్సులను కూడా తరలించడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖమ్మం రీజియన్ పరిధిలోనే 12 డిపోలు ఉండగా.. దూరప్రాంతమైన జగిత్యాల డిపో నుంచి బస్సులు తరలించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై డీఎం రమేశ్ను వివరణ కోరగా.. సీఎం సమావేశానికి 40బస్సులు కేటాయించామని, అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, రద్దీ లేని రూట్లలో నడిచే బస్సులను రద్దీ ఉన్న రూట్లలో సర్దుబాటు చేశామన్నారు.


