కరీంనగర్క్రైం: రోడ్డు ప్రమాదాల రహిత సమాజమే లక్ష్యంగా ‘అరైవ్–అలైవ్’ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని సీపీ గౌస్ఆలం తెలిపారు. శుక్రవారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 13న ప్రతీ గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 14న వాహనదారులు, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా సామూహిక ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 15న బ్లాక్ స్పాట్లు గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్స్, రోడ్ మార్కింగ్లు పునరుద్ధరించాలన్నారు. 16న పాఠశాలల వద్ద ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ క్రమశిక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులకు హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాముఖ్యతను వివరించాలన్నారు. 17న గోల్డెన్ అవర్లో బాధితులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్స, సాయం గురించి వివరించాలన్నారు. 18న వారంలో ఒక రోజు ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు విధించకుండా, కౌన్సెలింగ్ ద్వారా వాహనదారుల్లో మార్పు తీసుకురావాలన్నారు. అడిషినల్ డీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు.


