మానకొండూర్: సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసే వరకు నేషనల్ హైవే పనులు సాగనివ్వమని గ్రామస్తులు ఏడాదిగా అడ్డుకోగా.. అధికారులు అర్ధరాత్రి పోలీసు పహారాలో రోడ్డు పనులు పూర్తి చేశారు. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి స్టేజీ వద్ద 563 నేషనల్ హైవేలో భాగంగా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని, పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్కు సమస్యను విన్నవించారు. ఇటీవలే కలెక్టర్ నిలిచిపోయిన పనులు పరిశీలించి, సమస్యను తెలుసుకున్నారు. సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు కనిపించడంతో గ్రామస్తుల్లో ఆశలు చిగురించాయి. గురువారం అర్ధరాత్రి ఈదులగట్టెపల్లి స్టేజీవద్ద భారీ బలగాలతో జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ యంత్రాంగం రోడ్డు పనులు కొనసాగించి, తెల్లవారుజామున వరకు పూర్తిచేశారు. దీంతో గ్రామస్తులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు.


