కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఎంఏ జాన్ నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తాచాటాడు. బీసీ– సీ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్, జనరల్ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో 239వ ర్యాంక్ సాధించాడు. జాన్ ప్రస్తుతం కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లిలో ఎంఎల్హెచ్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మిట్టపెల్లి కిషన్– దివ్య దంపతుల చిన్న కుమారుడు జాన్ పదో తరగతి వరకు కథలాపూర్ మోడల్స్కూల్లో చదివాడు. హైదరాబాద్లో ఇంటర్, సికింద్రాబాద్లో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి గోల్డ్మెడల్ సాధించాడు. హైదరాబాద్లోని ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు.
అదనపు జిల్లా జడ్జీల బదిలీ
జగిత్యాలజోన్/కరీంనగర్క్రైం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న అదనపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ రెండో అదనపు జిల్లా జడ్జి డి.సాధనను రంగారెడ్డి జిల్లా 8వ అదనపు జిల్లా జడ్జిగా, జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణను నిజామాబాద్ రెండో అదనపు జిల్లా జడ్జిగా, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అదనపు జిల్లా జడ్జి డాక్టర్ తట్ట శ్రీనివాస్రావును హనుమకొండ ఇండస్ట్రీయల్ అండ్ లేబర్ కోర్టు జడ్జిగా బదిలీ చేశారు. అలాగే, సంగారెడ్డి మూడో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న జి.సునీత రవీందర్రెడ్డిని జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జిగా, సంగారెడ్డి నాలుగవ అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న కోట్ల లావణ్య బాల్రెడ్డిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అదనపు జిల్లా జడ్జిగా, రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి ఆరవ అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న సి.పావనిని కరీంనగర్ రెండో అదనపు జిల్లా జడ్జిగా, హైదరాబాద్ ఎల్బీ నగర్ కమర్షియల్ కోర్టు స్పెషల్ జడ్జిగా పనిచేస్తున్న నామ సంతోష్కుమార్ను కరీంనగర్ ఆరవ అదనపు జిల్లా జడ్జిగా నియమించారు.
హత్యకేసులో జీవితఖైదు
జూలపల్లి: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో అల్లుడిని బండిరాయితో మోది హత్య చేసిన కేసులో జడి కానుకయ్యకు జీవితఖైదు విధిస్తూ పెద్దపల్లి ప్రిన్సిపల్ జడ్జి కె.సునీత శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కాచాపూర్ గ్రామానికి చెందిన జాడి కనుకయ్య – శంకరవ్వ భార్యాభర్తలు. వీరి అల్లుడు జేజేల చెత్తయ్య(అశోక్)కు శంకరవ్వతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఈక్రమంలో జాడి కనుకయ్య ఒంటరిగానే ఉంటున్నాడు. ఈక్రమంలో 18 ఫిబ్రవరి 2024న చెత్తయ్య ఇంటికి వెళ్లిన జాడి కనుకయ్య.. తన భార్య శంకరవ్వ విషయంలో పథకం ప్రకారం గొడవపడ్డాడు. ఆ వెంటనే బండరాయి, రాడ్డుతో తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావమై చెత్తయ్య మృతి చెందాడు. ఈ మేరకు సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ఎస్సై శ్రీధర్ కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి.. జాడి కనుకయ్య నేరం చేసినట్లు రుజువు కావడంతో జీవితఖైదు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించారు. శిక్ష పడడంలో పీపీ డొంకెన రవి, పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి, ఏసీప కృష్ణ, సాక్షులను ప్రవేశ పెట్టడంలో సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై సనత్కుమార్, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించారు.


