నాగిరెడ్డిపేటలో మాట్లాడుతున్న సీఐ రాజారెడ్డి
సదాశివనగర్లో మాట్లాడుతున్న సీఐ వీరయ్య
నాగిరెడ్డిపేట/సదాశివనగర్/కామారెడ్డి రూరల్ : గణేశ్ ఉత్సవాలను ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి సూచించారు. నాగిరెడ్డిపేట పోలీస్స్టేషన్లో శనివారం నిర్వహించిన గణేశ్ మండపాల నిర్వాహకుల శాంతికమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేశ్ మండలపాల నిర్వాహకులు మండపాల వద్ద సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీంతోపాటు మండపానికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సిబ్బందిని సంప్రదించి వారి సహాయంతో కరెంట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణేశ్ సవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ వీరయ్య సూచించారు. సదాశివనగర్ రైతువేదిక భవనంలో గణేశ్ మండపాల నిర్వహకులచే శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. డీజేలకు అనుమతులు లేవని, డీజేలను ఏర్పాటుచేస్తే యజమానులతోపాటు మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎస్సైలు భార్గవ్గౌడ్, పుష్పరాజ్, ఏఎస్సై జగదీశ్, గణేశ్ మండపాల నిర్వాహకులు, సర్పంచ్ శిరీష, ఉప సర్పంచ్ ప్రవీణ్కుమారు ఉన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో శనివారం రాత్రి శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు, గ్రామ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఏఎస్ఐ రామకృష్ణ, వీడీసీ సభ్యులున్నారు.


