● కష్టాల్లో ఉన్న దోస్తులకు సాయం
● నేడు స్నేహితుల దినోత్సవం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆనంద భాష్పాలు పంచుకునేటప్పుడే కాదు.. కన్నీట మునిగినప్పుడూ దరిచేర్చు ధైర్యమే స్నేహం. నిస్సహాయత, నిరాశ కమ్ముకున్నప్పుడు నేనున్నాననే భరోసా కల్పించి వెలుగు నింపేవాడే నేస్తం. జీవన గమనంలో అడుగడుగునా తోడ్పాటుగా ప్రతి ఒక్కరికీ అనుభవమయ్యే, ఆసరా అయ్యే ఆప్తబంధం. అందుకే రక్త సంబంధం కన్నా స్నేహబంధం గొప్పదని అంటారు. స్నేహితుడి ఇంట్లో శుభకార్యం ఉన్నప్పుడే కాదు, కష్టం ఉందంటే కూడా మేమున్నామనే భరోసానిస్తున్నారు. అనారోగ్యంతో మంచం పడితే అందరూ వెళ్లి ధైర్యం చెబుతున్నారు. వైద్యం కోసం ఎంతో కొంత సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. భౌతికంగా దూరమైన స్నేహితుడి కుటుంబానికి మేమున్నామంటూ చేయూతనిస్తున్నారు. పిల్లల చదువు, పెళ్లిళ్లకు ఆసరా అవుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడమే స్నేహమని నిరూపిస్తున్నారు. నేడు ‘స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.


