
బినామీ బండ్లపై ఫోకస్
చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ శాఖల్లో అధికారు ల వద్ద అద్దె వాహనాలు న డిపిస్తూ జీవిస్తున్నాం. వాహనాల బి ల్లులు నెలలు, ఏళ్ల తరబడి పెండింగ్లో పె డితే మా పరిస్ధితి ఏమిటి. వెంటనే బిల్లులు మంజూరు చేయాలని అధికారుల కు విన్నవించాం. అలాగే బినామీ పేర్ల మీద వాహనాలు నడిపే వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. న్యాయం చేయాలి. – రాజాగౌడ్, హైర్ వెహికిల్స్
డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
● కలెక్టర్ దృష్టికి అద్దె వాహనాల
వ్యవహారం
● మంజూరైన, పెండిగ్ బిల్లులపై ఆరా
● ఏవోకు వివరాలు సమర్పించిన
హైర్ వెహికిల్స్ అసోసియేషన్
కామారెడ్డి క్రైం : జిల్లాలో దాదాపు సగం మందికిపైగా అధికారులు బినామీల పేర్లతో అద్దె వాహనాల బిల్లులు కాజేస్తున్నారని, బిల్లులు మంజూరు చేయడంలో ట్రెజరీ శాఖ కూడా నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. చాలా కాలంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో నడుస్తున్న బినామీ అద్దె వాహనాలు, పెండింగ్లో ఉన్న అద్దె వాహనాల బిల్లుల వ్యవహారం ఎట్టకేలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి వెళ్లింది. గత సోమవారం హైర్ వెహికల్స్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, పూర్తి వివరాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తాజాగా అద్దె వాహనాల వ్యవహారంపై దృష్టి సారించిన కలెక్టర్.. పూర్తి వివరాలు ఇవ్వాలని ఏవోను ఆదేశించినట్లు తెలిసింది. ఏవో మసూర్ అహ్మద్ హైర్ వెహికల్స్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులను బుధవారం పిలిపించి మాట్లాడారు. దీంతో వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న అద్దె వాహనాల బిల్లులు, బినామీ పేర్లతో ఆయా శాఖల్లో అధికారుల వద్ద నడుస్తున్న వాహనాల వివరాలను అసోసియేషన్ ప్రతినిధులు ఏవోకు సమర్పించారు.
వివరాలు అందజేత..
నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం అధికారుల వద్ద అద్దె వాహనాలు పెట్టుకునే విఽధానాన్ని అమలు చేస్తోంది. అందుకు గాను వాహనానికి నెలకు రూ.33 వేల వరకు అద్దె చెల్లిస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి జిల్లా, డివిజన్, మండల స్ధాయి అధికారి తమ సొంత వాహనాలు కాకుండా అద్దె వాహనాలు పెట్టుకుని నడుపుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది అధికారులు ప్రభుత్వ విధులకు తమ సొంత వాహనాలు నడిపిస్తూ బినామీ పేర్ల మీద ప్రతి నెలా బిల్లులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఎంతో కాలంగా ఉన్నాయి. దీనిపై హైర్ వెహికల్స్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా కలెక్టర్ దృష్టికి రావవడంతో చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఆ శాఖల్లోనే..
బినామీ వాహనాలు ప్రధానంగా ఇరిగేషన్, మిషన్ భగీరథ, డీఆర్డీఏ, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ శాఖలో ఎన్ని బినామీ వాహనాలు ఉన్నాయనే పూర్తి వివరాలను ఏవోకు అందజేసినట్లు అద్దె వాహనాల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
పెండింగ్ బిల్లులతో అవస్థలు..
ఆయా శాఖల్లో నిరుద్యోగులు అద్దె ప్రాతిపదికన పెట్టుకుని నడిపే వాహనాల బిల్లులు చాలా రోజులుగా రావడం లేదు. దీంతో వాహనాలు నడుపుతున్న వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వాటిలో ప్రధానంగా మైనారిటీ సంక్షేమ శాఖలో నడుస్తున్న వాహనాలకు 30 నెలలుగా, వైద్యారోగ్య శాఖలో 11 నెలలుగా, డీఆర్డీఏలో 24 నెలులుగా, ఆర్అండ్బీలో 22 నెలలుగా, మిషన్ భగీరథలో 12 నెలలుగా, రాజంపేట ఎంపీబీవో దగ్గర నడుస్తున్న వాహనానికి 16 నెలలుగా.. ఇలా అన్ని ప్రభుత్వ శాఖల్లో నడుస్తున్న వాహనాలకు బిలుల్లు మంజూరు కావాల్సి ఉంది. బినామీ పేర్ల మీద నడిచే వాహనాలకు మాత్రం జాప్యం లేకుండా బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయనీ, నిజాయితీగా నిరుద్యోగులు నడిపే వాహనాలకు బిల్లులు ఇవ్వడం లేదని వాహనాల యజమానులు వాపోతున్నారు. పెండింగ్ బిల్లుల వివరాలు సైతం హైర్ వెహికల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏవోకు అందజేశారు.

బినామీ బండ్లపై ఫోకస్