
దారి దోపిడీ ముఠా అరెస్ట్
తగ్గిన రోడ్డు ప్రమాదాలు..
కామారెడ్డి క్రైం: రోడ్డుపై వెళ్తున్న కంటెయినర్ లారీలోకి రన్నింగ్లోనే చొరబడి సెల్ఫోన్లు, హెడ్సెట్ బాక్సులను ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గతనెల 11న తెల్లవారుజామున కామారెడ్డికి సమీపంలోని టేక్రియాల్ వద్ద హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ కంటెయినర్ దారి దోపిడీకి గురైంది. బైక్పై వచ్చిన దుండగులు కంటెయినర్ రన్నింగ్లో ఉండగానే కట్టర్లతో సీల్ కట్ చేసి తలుపులు తెరిచి సినీ ఫక్కీలో లోనికి చొరబడి, దాదాపు రూ.8 లక్షల విలువైన ఫోన్లు, హెడ్సెట్ల బాక్సులను దొంగిలించారు. లారీని ఆపి డ్రైవర్ అడ్డుకోబోగా అతడిని చాకుతో బెదిరించి పరారయ్యారు. డ్రైవర్ ఫిర్యాదుతో దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లాకు చెందిన ప్రదీప్ హుడా, విమల్ సిసోడియా, రితిక్ జాంజా, బలరాం జాంజా, మాల్వియా దీపక్ కుమార్, దేవిసింగ్ సిసోడియాలుగా గుర్తించారు. వారిలో రితిక్ జాంజా, దీపక్ కుమార్, దేవిసింగ్ సిసోడియాలను గురువారం అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిఽందితులు ప్రదీప్ హుడా, విమల్ సిసోడియాలు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల వద్ద నుంచి చోరీకి ఉపయోగించిన వస్తువులు, ఓ బైకు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, మాచారెడ్డి ఎస్సై అనిల్, సిబ్బంది రవికిరణ్, రామస్వామి, అరుణ్, బందగి, శ్రీనివాస్, లక్ష్మీకాంత్లను అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈసారి 7 నెలల కాలంలో యాక్సిడెంట్లు గణనీయంగా తగ్గాయని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. గతేడాది మొదటి 7 నెలల్లో 170 ప్రమాదాలలో 179 మంది మరణించారని పేర్కొన్నారు. ఈ యేడాది ఇప్పటివరకు 129 ప్రమాదాలు జరగ్గా 135 మంది మరణించారని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 41 రోడ్డు ప్రమాదాలు, 44 మరణాలు తగ్గాయని వివరించారు. ప్రమాదాలను అరికట్టడం కోసం జిల్లా పోలీసు శాఖ చేస్తున్న కృషిని డీజీపీ జితేందర్ ప్రశంసించారని పేర్కొన్నారు.
కామారెడ్డి క్రైం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారం రోజులపాటు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 154 సెల్ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వాటి విలువ దాదాపు రూ. 26 లక్షలు ఉంటుందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సీఈఐఆర్ విధానంలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 3,705 సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. రికవరీలో ప్రతిభ చూపిన బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. ఫోన్లు పోగొట్టుకున్నవారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాల్రాజు(8712686114) ను సంప్రదించి తమ సెల్ఫోన్లు తీసుకువెళ్లాలని సూచించారు.