ధరూరు: మండలంలో సోమవారం సాయంత్రం భారీ కురిసింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో అంతంత మాత్రంగా కురుస్తున్న వర్షాలు పంట సాగుకు అనుకూలంగా ఉండటం లేదు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7 గంటల వరకు అరగంటపాటు భారీ వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వర్షం ముఖ్యంగా సీడ్ పత్తి సాగు చేసుకునే రైతులకు ఉపగయోగకరంగా మారింది.
12న భీమన అమావాస్య ప్రత్యేక పూజలు
ధరూరు: మండలంలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం భీమన అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కేశవాచార్యులు తెలిపారు. ఉత్తరాధి మఠం పీఠాధిపతులచే ప్రత్యేక పూజలు కొనసాగుతాయన్నారు. 18వ శతాబ్దం నాటి ఆంజనేయస్వామి ఆలయంలో భీమన(అత్తి) అమావాస్యను పురస్కరించుకొని బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష సుగంధ ద్ర వ్యాలతో ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణ, తమల పాత్ర ఆకు పూజలు, అష్టోత్తర నామా వళి పూజలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. ఉత్తరాధిమఠం పీఠాధిపతులు, ఉడిపి పలిమారు మఠం 1008 విద్యాధీశతీర్థ శ్రీపాదులు, 1008 విద్యా రాజేశ్వర తీర్థ శ్రీపాదుల వారు ఉదయం 6 గంటలకే ఆలయానికి చేరుకుని స్వామివారికి కృష్ణానదిలో దండోదక స్నానం, సంస్థాన ప్రత్యేక పూజలు చేస్తారన్నారు.
పోరాటాలతోనే
హక్కుల సాధన
గద్వాల: పోరాటాలతోనే హక్కులు సాధ్యమవుతాయని, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు వత్తాసు పలుకడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్మిక, రైతు సంఘాల నాయకులు అన్నారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని పాతబస్టాండులో జైల్భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు దాసోహం చేయడానికి కోరలు లేని కార్మిక చట్టాలు తెచ్చి నవభారతాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. కార్మిక చట్టాలు అమలైతే దేశంలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం పెరుగుతాయని, దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న పెట్టుబడిదారుల మెడలు వంచాలంటే ప్రతిఘటన, సమరశీల పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కాక తప్పదన్నారు. దేశంలో విచ్చలవిడిగా స్వేచ్ఛ వ్యాపారాన్ని నిరాటకంగా కొనసాగించి దేశాన్ని కరువు కాటకాల దేశంగా మారుస్తారా అని ప్రశ్నించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు తన వాటాను తగ్గించుకుని రాష్ట్రాలపై యూనియన్ గవర్నమెంట్ భారాలు మోపుతుందన్నారు. కార్మిక, రైతాంగ, వ్యవసాయ కూలీలకు చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు పోరాటాలు చేయడం ద్వారానే కార్మికవర్గం తన సమస్యలను పరిష్కరించుకోగలదని పిలుపునిచ్చారు. జైల్భరో కార్యక్రమానికి బీఆర్ఎస్వీ నాయకులు పల్లయ్య మద్దతు తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.


