మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తొలిసారిగా నోటుపుస్తకాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన నోటుపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు యూనిఫాం కూడా అందించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లో ఉన్న 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నోటుపుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే 38 కళాశాలలకు నోటుపుస్తకాలు చేరాయి. మిగిలిన 23 కళాశాలలకు మరో రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కళాశాలలకు చేరిన నోటుపుస్తకాలను మంగళవారం పలు కళాశాలల్లో విద్యార్థులకు అందజేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న ప్రతి విద్యార్థికి 12 నోటుపుస్తకాల చొప్పున పంపిణీ చేయనున్నారు.
యూనిఫాంలు కూడా..
నోటుపుస్తకాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తొలిసారిగా యూనిఫాంలను కూడా ప్రభుత్వం అందించనుంది. ఇందుకు సంబంధించిన యూనిఫాం క్లాత్ ఎంఈఓ కార్యాలయాలకు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి మహిళా సంఘాలకు క్లాత్ను అందించి, మెప్మా ఆధ్వర్యంలో యూనిఫాంలను కుట్టించేందుకు చర్యలు చేపడుతున్నారు. కుట్టు ప్రక్రియ పూర్తయిన అనంతరం విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేయనున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది. ఒకవైపు విద్యార్థులకు అవసరమైన నోటుపుస్తకాలను అందిస్తూనే.. మరోవైపు యూనిఫాం కూడా ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు, హాజరు పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
తొలిసారి నోటుబుక్కులతో పాటు, యూనిఫాం పంపిణీ
ఉమ్మడి జిల్లాలో 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు..
40,382 మంది విద్యార్థులకు లబ్ధి


