కనులపండువగా..
మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, భక్తుల గోవిందనామస్మరణ మధ్య వట్టెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం అలివేలుమంగ, గోదాదేవి సమేత వెంకన్నల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ అనంతనర్సింహారెడ్డి, ఉప్పల కృష్ణయ్య దంపతులు సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలతో ప్రధాన అర్చకులు సముద్రాల శ్రీమన్నారాయణాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం కల్యాణతంతు జరిపించారు.
వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవాన్ని
తిలకించడానికి వేలాది మంది భక్తులు
తరలివచ్చారు. – బిజినేపల్లి


