మంత్రి పర్యటన సైడ్లైట్స్
● ఉదయం 10.45 గంటలకు ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి ధరూరుకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.15 గంటలకు చేరుకోవాల్సి ఉండగా గంటన్నర ఆలస్యమైంది.
● ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయుల మధ్య వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. సరిత వర్గీయులు మంత్రి గో బ్యాక్.. పొంగులేటి గో బ్యాక్ అని నినాదాలు చేశారు.
● ప్రోటోకాల్ ప్రకారం కొందరినే సభపైకి పిలవడంతో.. మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరితను సైతం స్టేజీ పైకి పిలవకపోవడంతో ఆమె వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
● ఎంపీ మల్లు రవిని స్టేజీపైకి వెళ్లకుండా సరిత వర్గీయులు అడ్డుకోవడంతో ఆయన స్టేజీ కిందనే కూర్చున్నారు. కాసేపటి తర్వాత వెళ్లారు.
● ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రసంగిస్తుండగా సరిత వర్గీయులు.. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేవి కాంగ్రెస్ కండువా వేసుకుని మాట్లాడాలని అడ్డుతగిలారు.
● 11.24 గంటలకు మంత్రి పొంగులేటి ప్రసంగం ప్రారంభం.
● 11.50 గంటలకు ప్రసంగాన్ని ముగించి కాన్వాయ్ వద్దకు మంత్రి చేరుకుంటుండగా మరోసారి తోపులాట జరిగింది. కారులో కూర్చున్న మంత్రితో సరిత రెండు నిమిషాలు మాట్లాడారు.
● గంట పాటు జరిగిన మంత్రి పర్యటన ఆసాంతం అరుపులు, కేకలు, వాగ్వాదాలతోనే ముగిసింది.


