అభివృద్ధి చేసుకుందాం
సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
నాడు వైఎస్సార్..
నేడు రేవంతన్న: మంత్రి వాకిటి
పార్టీలు, పంతాలు వద్దు..
చదువుతోనే వెలుగులు
‘చదువుతోనే వెలుగు, మార్పు వస్తుంది. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో 25 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. రాష్ట్రం మొత్తం అన్ని పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టించి చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. విద్యా, వసతులు, భోజనం అందిస్తేనే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నియోజకవర్గంలోని లగచర్లలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి.’ అని సీఎం సూచించారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/కోస్గి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందినట్లనే విషయాన్ని గుర్తించి నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. సమష్టి కృషితో దేశంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, రాజకీయాలుంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు, పంతాలు పక్కన బెట్టి అభివృద్ధియే ఏకై క ఎజెండాగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లను సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘ మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. బెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా నూతన సర్పంచ్లు పాలకవర్గాలతో కలిసి పని చేయాలి. అభివృద్ధికి ఎన్ని నిధులైన మంజూరు చేస్తా. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రత్యేక ముఖ్యమంత్రి నిధులు అందిస్తా. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేసి సర్పంచులుగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నూతన సర్పంచ్లుగా మీపైనే ఉంది. గ్రామస్థాయి మొదలు మండలస్థాయి నాయకుల వరకు రాజకీయాలు పక్కనబెట్టి అన్ని పార్టీల సర్పంచ్లను కలుపుకొని గ్రామాల అభివృద్ధియే ఏకై క లక్ష్యంగా పని చేయాలి.’ అని పేర్కొన్నారు.
పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదు..
పాలమూరు జిల్లాలో ఇల్లు లేకపోయినా ఇక్కడి ప్రజలు నమ్మి చంద్రశేఖర్రావును ఎంపీగా గెలిపిస్తే జిల్లాకు చేసింది శూన్యమని ముఖ్యమంత్రి అన్నారు. గత పాలకులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతోనే గత పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారన్నారు. 2014లో తెచ్చిన జీఓ 69ను మంజూరు చేయిస్తే గత ప్రభుత్వం తొక్కి పెట్టిందన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే కమీషన్లు దండుకుందన్నారు. పాలమూరుపై చిన్నచూపుతోనే పదేళ్లలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, డిండి, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీతో పాటు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారన్నారు. తొడుక్కోవడానికి చెప్పులు, వేసుకోవడానికి బట్టలు లేని వాళ్లకు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదన్నారు. నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించుకుంటుంటే కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో ఎకరాకు 14 లక్షలు సరిపోవడం లేదని మంత్రి శ్రీహరి వచ్చి అడిగి ఎకరాకు రూ.18 లక్షలు ఆశిస్తున్నారని చెబితే.. ముఖ్యమంత్రిగా నేను ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించగా కేబినెట్ ఆమోదం పొందిందన్నారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 96 శాతం మంది రైతులు భూములు ఇస్తున్నారన్నారు.
దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తా
ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ
అందించే బాధ్యత సర్పంచులదే
నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాదయాత్ర చేసి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని, అలాగే పదేళ్లు అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధియే లక్ష్యంగా నేడు రేవంతన్న అలుపెరగని పోరాటం చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రేవంతన్న హయాంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కాలె యాదయ్య, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్రెడ్డి, నాయకులు కుంభం శివకుమార్రెడ్డి, వార్ల విజయ్కుమార్, రఘువర్ధన్రెడ్డి, విక్రంరెడ్డి, నర్సిములు, మహేందర్రెడ్డి, యూసూఫ్, శేఖర్, మద్దప్ప దేశ్ముఖ్, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి చేసుకుందాం
అభివృద్ధి చేసుకుందాం


