
రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్
అలంపూర్: రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. అలంపూర్ పట్టణంలో బీజేపీ కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల పరిష్కారంలో పురోగతి లేదన్నారు. రూ.50 కోట్లు ఖర్చు చేసి చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు చేపడితే 24 గ్రామాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉందన్నారు. తుమిళ్లకు అనుసంధానంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం, వేముల వద్ద జూరాల లింకును కలిపితే ఆర్డీఎస్ డీ–40 వరకు సాగునీటిని అందించవచ్చన్నారు. అధికారుంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదన్నారు. గద్వాలలోని ర్యాలంపాడు రిజర్వాయర్ 4 టీఎంసీల కెపాసిటీ ఉన్నప్పటికి నిధులు కేటాయించి నిర్వహణ చేపట్టకపోవడంతో 2 టీఎంసీల నీళ్లు అందడం లేదన్నారు. నెట్టెంపాడు కింద ఉన్న 104, 107, 99 ప్యాకేజీలు పూర్తి చేయకపోవంతో కృష్ణా, తుంగభద్ర వంటి జీవనదులు ఉన్నప్పటికి రైతులు సాగు నీటికి కష్టాలు పడాల్సి వస్తోందన్నారు. అలంపూర్ చౌరస్తాలో నిర్మించిన 100 పడకల ఆస్పత్రిలో సిబ్బంది లేక వైద్య సేవలు అందడం లేదన్నారు. గద్వాలలో మెడికల్ కళాశాలలో సరైన సౌకర్యాలు, సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నప్పటికి ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజగోపాల్, ఈశ్వర్, శరత్ బాబు, సంజీవ రెడ్డి, జగదీశ్, నాగేశ్వరరెడ్డి, నాగమ్లయ్య, రంగస్వామి, నరేష్, మద్దిలేటి, రాజశేఖర్, దాన రెడ్డి, సుధాకర్, లక్ష్మణ్, రవికుమార్ తదితరులు ఉన్నారు.