
బీచుపల్లిలో ప్రత్యేక పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ భక్తుడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి ప్రత్యేక ఆకుపూజ, అభిషేకంతో పాటు వివిధ ప్రత్యేక పూజలు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో అభయాంజనేయస్వామిని దర్శించుకుకొని ధ్వజస్తంభం ఎదుట కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వికాస తరంగిని, విశ్వ హిందూ పరిషత్ మరియు ధర్మ ప్రసార సమితి ఆధ్వర్యంలో సభ్యులు ఆలయంలో 41సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి హనుమంతుని గొప్పతనం, ధైర్య సాహసాల గురించి భక్తులకు వివరించారు. ఈఓ రామన్గౌడ్, పాలక మండలి సభ్యులు, వివిద హిందూ సంఘాల సభ్యులు, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.