● తాడిచర్ల–2 బ్లాక్ సాధన
విజయోత్సవాలు నిర్వహణ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన తాడిచర్ల–2 బ్లాక్ సాధన విజయోత్సవాలను గురువారం భూపాలపల్లి ఏరియాలో ఘనంగా నిర్వహించారు. కేటీకే ఓసీ–2 గనిలో జరిగిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడిచర్ల–2 బ్లాక్ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను కార్మికులకు పంపిణీ చేశారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, కార్మికులతో కలిసి మిఠాయిలు పంచుకొని విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. తాడిచర్ల–2 బ్లాక్ సాధన సింగరేణి భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. ఈ గని ద్వారా భూపాలపల్లి ఏరియాకు ప్రయోజనం చేకూరడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును సింగరేణికి నేరుగా కేటాయించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎంలు, ప్రాజెక్టు అధికారులు, అధికారులు, ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


