జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో 48,930 ఎకరాల్లో వరిసాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో జూలై 16వ తేదీ వరకు కేవలం 802 ఎకరాల కోసమే రైతులు నారు సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో చలివాగు, మోరంచవాగు, బొగ్గులవాగు ప్రాజెక్టు, గణపసముద్రం, భీంఘన్పూర్ రిజర్వాయర్లతో పాటు చెరువులు, ఎస్సారెస్పీ కాలువల నీరుపై ఆధారపడి ఎక్కువగా వరిసాగు జరుగుతుంది. వర్షాలు లేక ఆయా జలాశయాలు, వాగులు, వంకల్లో నీరు లేకపోవడంతో వరిసాగు చేసేందుకు రైతులు వెనుకంజ చేస్తున్నారు. జూలై మాసంలో వరినారు చేతికొచ్చి, ఆగస్టులో నాట్లు వేయాల్సి ఉండగా ఇప్పటికీ వేలాది మంది రైతులు పొలాలను కూడా సిద్ధం చేయలేదు. దీంతో ఈ ఏడాది వరిసాగు కష్టతరమేనని తెలుస్తోంది.


