● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి అర్బన్: ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా తక్కువ నీటి వినియోగ పంటల సాగు వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్శర్మ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా సాగులో వైవిధ్యాన్ని పాటించాలని సూచించారు. మిల్లెట్స్, పప్పుధాన్యాలు, కూరగాయలు, పామాయిల్ వంటి తక్కువ నీటి అవసరమున్న పంటల సాగుపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా ఉద్యాన అధికారి తిరుపతి, ఏడీఏలు శ్రీపాల్, రమేశ్, మండలాల ఏఈఓలు పాల్గొన్నారు.
విద్యార్థుల నమోదు పెంచాలి
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. చల్లగరిగ పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధంచేసి పంపాలని ఆదేశించారు. సమీక్షకు గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్ వారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, డీఆర్డీఓ బాలకృష్ణ పాల్గొన్నారు.
అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లాలో ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం లభించే వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో నీటి సరఫరా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇంట్రా ఈఈ సురేందర్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జునరెడ్డి, ఎంపీడీఓలు, మిషన్ భగీరథ ఇంజినీర్లు పాల్గొన్నారు.


