భూపాలపల్లి రూరల్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, 104 ఆరోగ్య సేవలు, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు, ఇందిరమ్మ గృహాలు, ఫీజు రీయింబర్స్మెంట్, పావలా వడ్డీ రుణాలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సామాజిక భద్రతా పింఛన్లు, స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రోత్సాహం వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలు కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాయకమన్నారు. పేద ప్రజల సంక్షేమమే నిజమైన పాలన అనే విషయాన్ని ఆయన తన పాలనతో నిరూపించారని అన్నారు. అనంతరం రైతు భరోసా నిధుల విడుదలకు కృతజ్ఞతగా సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవాన్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శీను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు పాల్గొన్నారు.


