కాళేశ్వరం: కాళేశ్వరాలయం అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ బుధవారం మరోమారు వాయిదాపడింది. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఏప్రిల్ 20న సీఎం రేవంత్రెడ్డి రూ.198 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు హైదరాబాద్లో గతనెల 23న, ఈనెల 4న జరగాల్సి ఉండగా అనివార్ల కారణాలతో వాయిదా పడ్డాయి. బుధవారం కూడా వాయిదా పడినట్లు తెలిసింది. ఈనెల 15న నిర్వహించనున్నట్లు సమాచారం. టెండర్ల ప్రక్రియ వాయిదా పడుతుండడంతో పనులు 2027 జూన్లో నిర్వహించే గోదావరి పుష్కరాల సమయానికి పూర్తవుతాయా అనేది సందేహంగా ఉంది. ఇప్పటికే దేవస్థానంలోని ప్రాకారాలు, ఉప ఆలయాల్లోని విగ్రహాలను తొలగించి రాజరాజేశ్వరస్వామి వసతి గృహంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఫైవుడ్ బాక్సుల్లో వరిధాన్యంలో భద్రపరిచారు. కానీ టెండర్లు ముగిసి పనులు ప్రారంభం జరిగితేనే అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక దేవాదాయశాఖ అధికారులు మౌనంపాటిస్తున్నారు. ఎలాంటి విషయాలూ బయటకు తెలియకుండా గోప్యత పాటిస్తున్నట్లు తెలిసింది.
ఆదిముక్తీశ్వరాలయంలో పూజలు
కాళేశ్వరం దేవస్ధానం గత నెల 17నుంచి మూసివేయడంతో ఉప ఆలయమైన అడవిలోని శ్రీఆదిముక్తీశ్వరాలయంలో అత్తిచెట్టుతో తయారు చేసిన ఉత్సవమూర్తులు బాలాలయంలో ఆసీనులయ్యారు. అక్కడే భక్తులు దర్శనాలు చేసుకునే వీలు కల్పించారు. కాలసర్ప, శని పూజలు అక్కడే నిర్వహిస్తున్నారు. ఆదిముక్తీశ్వరాలయంలో అభిషేక పూజలు నిర్వహిస్తున్నారు.
15న నిర్వహించే అవకాశం


