జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు
నిధులు రావాల్సి ఉంది..
నిర్వహణ ఎలా?
నాలుగేళ్లుగా పత్తా లేని హెచ్డీఎఫ్ నిధులు
జనగామ రూరల్: గ్రామీణ ఆస్పత్రి అభివృద్ధి నిర్వహణకు గాను ఏటా విడుదల చేసే (హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్) నిధులు నాలుగేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో 2023 నుంచి ఆస్పత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రభుత్వ దవాఖానాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చీపుర్లు, బకెట్లు, ఇంటర్నెట్, కంప్యూటర్ల మరమ్మతుకు డబ్బులు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆస్పత్రి అభివృద్ధి నిధులు విడుదల చేయకపోవడంతో పీహెచ్సీలు, సీహెచ్సీల నిర్వహణ సరిగాలేక అటు వైద్యులు, ఇటు పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రతీ పీహెచ్సీ, ఇతర వైద్యశాలలకు ఆస్పత్రి అభివృద్ధి నిధులు నాలుగేళ్లుగా నిలిచి ఏ చిన్న అవసరమున్నా.. ఏదైనా వస్తువు కొనాలన్నా వైద్యుల జేబులోంచే ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఏడాదికి రూ.1.75 లక్షలు
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సివిల్ ఆస్పత్రులకు ఏటా ప్రభుత్వం నిర్వహణ నిధుల కోసం రూ.1.75 లక్షల చొప్పన హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ మంజూరు చేసేది. 2023 తర్వాత ఈ నిధులు నిలిచిపోయాయి. గతంలో ఈ నిధులతో ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల తీర్మానం మేరకు మౌలిక సదుపాయాలు కల్పించేవారు. దీంతో పెరుగుతున్న వైద్య అవసరాలు, రోగుల తాకిడికి అనుగుణంగా సదుపాయాలులేక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, పాడైన కంప్యూటర్లకు మరమ్మతు చేయించాలన్నా, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నా, స్టేషనరీ ఖర్చులు చెల్లించాలన్నా వైద్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. వీటన్నంటికీ కనీసం నెలకు ఒక్కో ఆస్పత్రికి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు అవసరముంటుంది. ఈమేరకు నిధులు రాకపోవడంతో వస తుల కల్పనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆస్పత్రి అభివృద్ధి నిధులు నాలుగేళ్లుగా నిలిచిపోయాయి. ప్రతీ నెల పీహెచ్సీ, సీహెచ్సీల నిర్వహణ భారంగా ఉంది. కొన్నిచోట్ల నిర్వహణ ఖర్చులు వారే భరిస్తున్నారు. నెలనెలా ఆస్పత్రి అభివృద్ధి నిధులు విడుదల చేస్తే ఎలాంటి లోటు లేకుండా మౌలిక సౌకర్యాలు కల్పించే అవకాశముంది.
– వాణిశ్రీ, జిల్లా వైద్యాధికారి
మండల పరిషత్ల పదవీకాలం ఏడాది కిందట ముగియడంతో పీహెచ్సీల అభివృద్ధి కమిటీలు కూడా ఏర్పాటు కాలేదు. కమిటీలున్నా కనీసం నిధుల గురించి అడిగే పరిస్థితి ఉండేది. ఆయా మండలాల పరిధిలోని గ్రామాల నుంచి ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిత్యం 50నుంచి 100మంది రోగులు వస్తున్నారు. వారికి సేవలు అందించడం కష్టంగా మరింది. ఫలితంగా రోగులు అవస్థలు పడుతున్నారు. రెగ్యులర్ వైద్యులు ఎంతో కొంత ఖర్చు చేస్తున్నప్పటికీ ఇతరులు ఖర్చు చేసేందుకు వెనకాడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
నిర్వహణ భారంగా ప్రభుత్వ ఆస్పత్రులు
సొంత జేబుల్లోంచి ఖర్చు చేస్తున్న
వైద్యాధికారులు
పేషెంట్లకు మౌలిక సదుపాయాలు
కల్పించడంలో ఇక్కట్లు


