జనగామ: పట్టణంలో శ్రీ పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర సోమవారం సాయంత్రం హరేకృష్ణ హరేరామ భక్త బృందం, గీతాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. బస్టాండ్ చౌరస్తా వద్ద ప్రారంభమైన రథయాత్రను మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ప్రారంభించారు. వాస్తు గణపతి దేవాలయం మీదుగా పట్టణ ప్రధాన వీధుల గుండా రైల్వేస్టేషన్ వరకు సాగిన ఈ యాత్రలో భక్తులు హరినామ సంకీర్తనలు, భజనలతో పాల్గొని భక్తి పారవశ్యాన్ని నెలకొల్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో ఇద్దరు ఏసీపీలు, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో ధనుంజయ్ పండిత్ దాస్, మాధవ్ గోవింద దాస్ ప్రభు, శ్రీ సనాతన దాసు, పద్మావతి దేవి దాసి, కృష్ణ భావదేవిదాసి, బాలమణి, వెంకన్న, నాగేందర్, ధర్మపురి శ్రీను, అరుణ్, పరశురాములు, విజయ్, సిద్ధులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


