● సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ: జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులకు యూరియా, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్పుట్లు ఎలాంటి కొరత లేకుండా సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్హెచ్జీ మహిళా శక్తి రైతు సేవా కేంద్రాల మహిళలతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 62 ఎస్హెచ్జీ మహిళా శక్తి రైతు సేవా కేంద్రాల్లో ప్రస్తుతం 44 కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, నేడు 15 ఇ–పాస్యంత్రాల పంపిణీతో 59 క్రియాశీల వ్యవసాయ ఇన్పుట్ కేంద్రాలు రైతులకు సేవలు అందించనున్నాయని తెలిపారు. అనంతరం ఎస్ హెచ్జీ మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలకు 15 ఇ–పాస్ యంత్రాలను కలెక్టర్ పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, డీఆర్డీఓ, డీపీఎం, మార్క్ఫెడ్, ఏడీఏ, సీ్త్రనిధి బ్యాంకు ప్రతినిధులు, 62 రైతు సేవా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
పాడి రైతులకు ఎక్స్గ్రేషియా అందజేత
జనగామ రూరల్: ప్రజావాణిలో అందిన ప్రతీ అర్జీని సానుభూతితో పరిశీలించి, అర్హులైన బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి గేదెలు మృతి చెందిన ఇద్దరు పశుపోషక రైతులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎక్స్గ్రేషియా చెక్కులను కలెక్టర్ తన చాంబర్లో బాధితులకు అందజేశారు. దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన ఉప్పల అంజయ్యకు రూ.1,00,000 ఎక్స్గ్రేషియా, అదే మండలం చిన్నమడూర్ గ్రామానికి చెందిన అనగాని రాజుకు రూ.1,20,000 ఎక్స్గ్రేషియా మంజూరు చేసి కలెక్టర్ వారికి చెక్కులు అందజేశారు.


