● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 కింద లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టి ఈ నెల 24 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో యాక్షన్ ప్లాన్ అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను ఎస్సీ జనాభా ప్రాతిపదికగా మూడు కేటగిరీల వారీగా మండలాలు, మున్సిపాలిటీలకు కేటాయించినట్లు తెలిపారు. రుణాల మంజూరు, బ్యాంకు ఖాతాలు, డాక్యుమెంటేషన్, ఇతర బ్యాంకింగ్ సేవలకు సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు పూర్తి సహకారం అందించాలని బ్యాంకర్లకు సూచించారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారులు, కార్యనిర్వాహక సంచాలకులు, ఎంపీడీఓలు, మున్సిపాలిటీల కమిషనర్లు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
● రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్
జనగామ రూరల్: రహదారులపై ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. మంగళవారం
హైదరాబాద్ డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి అదనపు కార్యదర్శితో కలిసి రవాణా, ఆర్ అండ్బీ, కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. దీనికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ మాట్లాడుతూ..జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశాలు ప్రతినెలా నిర్వహించాలని తెలిపారు. టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని, రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రామానుజుల బోధనలు నేటికీ ఆచరణీయం
● త్రిదండి చినజీయర్ స్వామి
జనగామ: వెయ్యి సంవత్సరాల క్రితం సమతామూర్తి భగవత్ రామానుజాచార్యులు బోధించిన విలువలు నేటికీ, భవిష్యత్తులోనూ ఆచరణీయమేనని త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. పట్టణంలోని బాణాపురం శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న తృతీయ పుష్కర వేడుకల సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.. రామానుజుల వారి జీవితం, బోధనలను కవితా రూపంలో ప్రజలకు చేరవేస్తున్న కవులను అభినందించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, కవులు, కళాకారులను స్వామిజీ సత్కరించారు. ఉదయం శ్రీ సుదర్శన యాగం చినజీయర్ స్వామి సమక్షంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చిన జీయర్ స్వామి వస్త్రాలను అందించారు.


