మేడిపల్లి: సరైన మయానికి బస్సు రావడం లేదని భీమారం మండలం గోవిందారం గ్రామంలో ఆదివారం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఇంతకు ముందు మోత్కురావుపేట నుంచి జగిత్యాల వెళ్లేందుకు 45 నిమిషాల సమయం పడితే ప్రస్తుతం అదే బస్సును తాండ్రియాల్, ఈదులలింగంపేట, మన్నేగూడెం గ్రామాల మీదుగా మళ్లించడంతో సుమారు 2 గంటల సమయం పడుతోందని వాపోయారు. దీంతో విద్యార్థులు సమయానికి స్కూళ్లు, కాలేజీలకు చేరుకోలేకపోతున్నారని, తరగతులు మిస్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ పుల్లురి ఉమారాణి–దేవయ్య ఘటన స్థలానికి వెళ్లి విప్ ఆది శ్రీనివాస్కు ఫోన్లో విషయం తెలిపారు. వెంటనే విప్ ఆది డిపో మేనేజర్కు ఫోన్ చేసి జగిత్యాల–తాండ్రియాల్ వయా మన్నేగూడెం, ఈదులలింగంపేట మీదుగా అదనపు సర్వీసులు నడపాలని ఆదేశించినట్లు సర్పంచ్ తెలిపారు. అలాగే జగిత్యాల–ఒడ్యాడ్ రూట్లో నడిచే బస్సులు రాగోజిపేటలో ఆపడం లేదని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. రాగోజిపేటలో బస్సులు ఆపాలని సర్పంచ్ చెన్నమనేని అజిత్రావును ప్రయాణికులు కోరగా, డిపో మేనేజర్కు ఫోన్ చేసి విషయం తెలియజేశారు.


