జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన తోకల సమత (29) శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన సమతకు మోతె గ్రామానికి చెందిన తోకల మహేశ్తో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. కొద్దికాలంగా సమత అనారోగ్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. సమత తల్లి ఆర్మూరి లక్ష్మీరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
గంజాయి విక్రయించిన ఇద్దరికి ఏడేళ్ల జైలు
జగిత్యాలజోన్: గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ఇద్దరికి ఏడేళ్ల చొప్పున జైలు, రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జడ్జి జి.సునీత శనివారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సయ్య కథనం ప్రకారం.. 31 అక్టోబర్ 2023న రాయికల్ మండలం అల్లీపూర్ ఎస్సారెస్పీ కాలువ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అదే మండలం ఒడ్డెలింగాపూర్కు చెందిన బోదాసు సతీష్కుమార్, జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంకు చెందిన బెక్కం రేవంత్ అలియాస్ బిట్టు స్కూటీపై జగిత్యాల నుంచి రాయికల్ వైపు వెళ్తున్నారు. పోలీసులకు అనుమానాస్పదంగా కనబడటంతో తనిఖీ చేశారు. స్కూటీలో గంజాయి ప్యాకెట్లు కనిపించింది. వాటిని అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ గ్రామానికి చెందిన మేస్రం నాగనాథ్ నుంచి కొని తెచ్చినట్లు చెప్పారు. అప్పటి ఎస్సై అజయ్ ముగ్గురు నిందితులు సతీష్కుమార్, రేవంత్, నాగనాథ్పై కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ అరీఫ్అలీఖాన్ నిందితులను కోర్టులో హాజరుపర్చారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్కుమార్, బి.రాజు, కె.నరేష్ సాక్ష్యాలను చూపడంతో సతీష్కుమార్, రేవంత్కు ఏడేళ్ల జైలు, ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. నాగనాథ్పై కేసు నిరూపణ కాకపోవడంతో నిర్దోషిగా ప్రకటించారు.
మంజూరైన కోర్టులకు నిధులు ఇప్పించండి
ధర్మపురి: మంజూరైన అదనపు కోర్టులకు ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలోని కోర్టుల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో న్యాయవాదుల సూచన మేరకు హైకోర్టు ఇటీవల ఫ్యామిలీ, అదనపు జుడిషియల్ కోర్టులను మంజూరు చేసింది. వాటికి అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో కోర్టుల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సత్యం, సీనియర్ న్యాయవాది రాచకొండ శ్రీరాములు పాల్గోన్నారు.


