జగిత్యాల: పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య రక్షణలో భాగంగా చెత్త సేకరణలో నూతన మార్పులు తీసుకొచ్చారు. ఇక నుంచి నాలుగు రకాలుగా చెత్త సేకరణ చేపట్టనున్నారు. చెత్తను నాలుగు విభాగాలుగా ఇంట్లోనే వేరు చేసి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పట్టణాలు, గ్రామాల్లో తడి, పొడి చెత్త కలిపి ఇస్తుండటంతో రీసైక్లింగ్, కంపోస్టింగ్ పనులు సక్రమంగా జరగడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో తడి, పొడి చెత్తను రెండు రకాలుగా వేరు చేసి ఇస్తుండగా.. ప్రస్తుతం నాలుగు రకాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్తతోపాటు ప్రమాదకరమైన వస్తువులను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఇంట్లో నాలుగు డబ్బాలు పెట్టుకుని తడి చెత్త కింద కూరగాయల తొక్కలు, పండ్లకు సంబంధించినవి, పొడి చెత్తలో ప్లాస్టిక్, కాగితాలు, ప్రమాదకరమైన చెత్తలో నాప్కిన్లు, మెడికల్కు సంబంధించినవి, ఈవేస్ట్లో మొబైల్, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వేయాల్సి ఉంటుంది.
పర్యావరణానికి ముప్పు లేకుండా..
నాలుగు రకాలుగా చెత్త సేకరణ చేడితే గ్రామాల్లో పరిశుభ్రత మెరుగు పడటంతోపాటు, ఈగలు, దోమలు, దుర్వాసన నివారించగలుగుతారు. తడి చెత్తతో కంపోస్ట్ తయారుచేయవచ్చు. పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం సులభంగా ఉంటుంది. దీంతో పర్యావరణానికి ముప్పు ఉండదు.
సేకరణ ఇలా..
గ్రామీణ ప్రాంతాలతోపాటు, మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ పకడ్బందీగా చేపట్టాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు రకాల బుట్టల్లో నిలువ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశా రు. మున్సిపాలిటీల్లో నిర్మాణాలు, కూల్చివేత వ్యర్థాలు, వేరు చేసి ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇళ్లలోని ఘన వ్యర్థాలను రోడ్లపై, కాలువల్లో, వీధుల్లో కాల్చి తే చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. వీధుల్లో వ్యాపారం చేసే వ్యాపారుల వద్ద పోగయ్యే అయ్యే చెత్తను వారు డబ్బా ఏర్పాటు చేసుకుని అందులోనే వేయాలి. బయోమెడికల్ వ్యర్థాలను సైతం ఒక డ బ్బాను ఏర్పాటు చేసుకుని అందులో వేస్తే చాలావరకు ఉపయోగాలుంటాయని అధికారులు పేర్కొంటున్నారు.


