జగిత్యాల: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఒక్కో బీఎల్వో రోజుకు వంద మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 50 శాతం కంటే తక్కువ పురోగతి ఉన్న పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటరు జాబితా వివరాలను ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేస్తున్నారనే వదంతులను ఖండించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారంలో ఆధార్నంబర్ ఇవ్వడం తప్పనిసరికాదని, ఓటర్లపై ఒత్తిడి తేవొద్దని సూచించారు. ఆన్లైన్లో ఫారం సమర్పించిన వారిని మళ్లీ ఆఫ్లైన్ ఫారం అడగవద్దని, జాబితాలో పేర్ల తొలగింపు, మరణించిన వారిగా నమోదు వంటి పొరపాట్లను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. అనంతకం కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈనెల 26లోపు 90 శాతం ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఏఎస్డీ జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ప్రమాదాలు నివారించాలి
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్రాజ్ అన్నారు. కలెక్టర్తో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పనిచేయాలని, ముఖ్యంగా ఆక్రమణలను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. రహదారుల వెంట ఉన్న ఆస్పత్రులను మ్యాపింగ్ చేసి అత్యవసర వైద్యసేవలు అందించేలా చూడాలన్నారు.
పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యం
మల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సాతారం జెడ్పీ హైస్కూల్ను పరిశీలించారు. పాఠశాలకు 39 తరగతి గదులు అవసరంకాగా 16గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఇందుకు రూ.12కోట్లు అవసరమని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. సర్పంచ్ పోతవేని నారాయణ, హెచ్ఎం శ్రీహరి, మెట్పల్లి ఆర్డీవో నరసింహరావు, తహసీల్దార్ రాంచందర్, ఏఈఈ శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.


