
మనమంతా మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం-2025లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇంతలో అమెరికా జనాభా బ్యూరో ఒక ఆసక్తిక నివేదికను వెలువరించింది. 2025 నూతన సంవత్సరం తొలిరోజునాటికి ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరుకుంటుందని, దీనిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటుందని తెలియజేసింది.
2024 చివరి నాటికి ప్రపంచ జనాభా(World population) 7.1 కోట్లు పెరిగిందని, కొత్త సంవత్సరం నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని తాజాగా అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది. 2023నాటి జనాభాతో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గడంతోపాటు 0.9 శాతంగా నమోదైంది. 2025 విషయానికొస్తే జనవరిలో ప్రపంచ జనాభా మరో 7.5 కోట్లు పెరుగుతుందని, ప్రపంచంలో ప్రతి సెకనుకు 4.2 జననాలు, 2.0 మరణాలు నమోదవుతాయని ఈ నివేదిక అంచనా వేసింది.
2024లో అమెరికా జనాభా 26 లక్షల మేరకు పెరిగింది. 2025 నాటికి అమెరికా జనాభా(US population) 34.1 కోట్లకు చేరుతుందని బ్యూరో అంచనాలున్నాయి. నూతన సంవత్సరం జనవరిలో అమెరికాలో ప్రతి తొమ్మిది సెకండ్లకు ఒక జననం, ప్రతి 9.4 సెకండ్లకు ఒక మరణం ఉంటుందనే అంచనాలున్నాయి. 2020 దశకంలో అమెరికా జనాభా దాదాపు 97 లక్షల మేరకు పెరిగింది. ఈ పెరుగుదల రేటు 2.9 శాతంగా ఉంది. 2010 దశకంలో అగ్రరాజ్యం జనాభా పెరుగుదల 7.4 శాతం ఉంది. 2024లో భారతదేశ జనాభా 144.17 కోట్లు. 2025 భారత జనాభా అన్ని దేశాలను మించి టాప్లో ఉండే అవకాశాలున్నాయని అమెరికా జనాభా బ్యూరో అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: New Year Celebration: రాజధాని సిద్ధం.. వేడుకలకు జనం సన్నద్ధం