వెనెజువెలా మహావిషాదం: శిథిలాల కిందే మరెందరో! | Venezuela Disaster Deepens: Death Toll Rises Hundreds Still Under Rubble | Sakshi
Sakshi News home page

వెనెజువెలా మహావిషాదం: శిథిలాల కిందే మరెందరో!

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:54 AM

Venezuela Disaster Deepens: Death Toll Rises Hundreds Still Under Rubble

లాటిన్‌ అమెరికా దేశం వెనెజువెలాను జంట భూకంపాలు అతలాకుతలం చేశాయి. రాజధాని కారకాస్‌తో పాటు తీర ప్రాంతాల్లో ఎటు చూసినా.. భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ.. సహాయక చర్యలు సాగుతున్నా కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. మృతుల సంఖ్య 235కు చేరుకోగా, 1,500 మందికిపైగా గాయపడ్డారు. వేల మంది జాడ ఇంకా తెలియరావడం లేదు. అలాగే.. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

బుధవారం సాయంత్రం సెకన్ల తేడాతో సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి.. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా లా గువైరా, కారకాస్‌ పరిసర ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. సుమారు 250 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వందల మంది ఆ శిథిలాల కిందే చిక్కుని ఉంటారని అధికారులు చెబుతుండగా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.  

భారీగా మృతులు?
శిథిలాలను తొలగించే కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతుండటంతో వెనెజువెలాలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే వెనెజువెలా ప్రభుత్వం, అలాగే అక్కడి అధికార యంత్రాగం చెబుతున్న పరిస్థితులకు భిన్నంగా అక్కడి వాతావరణం కనిపిస్తోంది. మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై వాళ్ల ప్రకటనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ భూకంపంలో 10 వేల మంది దాకా మరణించి ఉంటారని తొలుత అక్కడి మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. అయితే కాసేపటికే.. ఆ సంఖ్యను వందల్లోకి తీసుకొచ్చాయి. అయితే.. 

అమెరికా భూగర్భ సర్వే (USGS) మాత్రం.. ఆ సంఖ్య లక్ష దాకా ఉండొచ్చని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.  పూర్తి స్థాయి శిథిలాల తొలగింపనకు నాలుగైదు రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉండడంతో.. దాదాపు 11 వేల మందికి పైగా మిస్‌ అయినట్లు కథనాలు వెలువడుతుండడంతో.. మృతుల సంఖ్య బాగా పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తోంది. 

ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ
ఈ భూకంపాల వల్ల వెనెజువెలాకు 7.5 బిలియన్ డాలర్లకుపైగా ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. ఇది దేశ జీడీపీలో దాదాపు 7 శాతం వరకు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. చమురు, గ్యాస్ రంగానికి పెద్దగా నష్టం జరగకపోయినా.. విద్యుత్ అంతరాయాలు చమురు ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

సహాయానికి ముందుకొచ్చిన..
వెనెజువెలాలో భారీ భూకంపం ధాటికి.. వేలాది మంది నిరాశ్రయులుగా మారగా, సహాయక శిబిరాల్లో వారికి ఆహారం, తాగునీరు, వైద్యసేవలు అందిస్తున్నారు. విపత్తు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పలు దేశాలు వెనెజువెలాకు అండగా నిలుస్తున్నాయి. అమెరికా 150 మిలియన్ డాలర్ల అత్యవసర సాయాన్ని ప్రకటించడంతో పాటు సహాయక బృందాలను పంపింది. చిలీ, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, టర్కీ, బ్రిటన్‌ వంటి దేశాలు కూడా రెస్క్యూ బృందాలు, పరికరాలు, అత్యవసర సాయాన్ని అందిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన ప్రత్యేక రెస్క్యూ బృందాలు కూడా వెనెజువెలాకు చేరుకుంటున్నాయి. మరోవైపు స్టార్‌లింక్‌ సంస్థ నెల రోజుల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామని ప్రకటించింది.    

అమెరికా భూగర్భ సర్వే (USGS) ప్రకారం.. వెనెజువెలా రాజధాని కారకాస్‌కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో తొలుత 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ప్రకంపనల నుంచి ప్రజలు తేరుకునేలోపే.. నిమిషం కూడా గడవకముందే(39 సెకన్లలోనే) 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం రావడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఇది 1900 తర్వాత వెనెజువెలాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా అధికారులు చెబుతున్నారు.

గమనిక: పై వీడియోలు వెనెజువెలా భూకంపం పేరిట ఎక్స్‌ ఖాతాలో వైరల్‌ అవుతున్నవే!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement