భారత్‌లో దౌత్యవేత్తల తొలగింపు.. కెనడాకు మద్దతుగా అమెరికా, బ్రిటన్‌ | US, UK Back Canada In Dispute With India Over Diplomats | Sakshi
Sakshi News home page

భారత్‌లో దౌత్యవేత్తల తొలగింపు.. కెనడాకు మద్దతుగా అమెరికా, బ్రిటన్‌

Oct 21 2023 9:43 AM | Updated on Oct 21 2023 10:27 AM

US, UK Back Canada In Dispute With India Over Diplomats - Sakshi

ఖలిస్తానీ సానుభూతిపరుడు హర్‌ప్రీత్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య నెలకొన్న విభేదాలు రోజురోజుకీ మరింత ముదురుతున్నాయి. భారత్‌, కెనడా దౌత్యపరమైన వివాదంలో ఇతర దేశాల ప్రమేయం పెరగడంతో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి.

భారత్‌లోని 41 మంది దౌత్యవేత్తలను కెనడా వెనక్కి రప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్‌ కల్పించుకొని కెనడాకు మద్దతుగా నిలిచాయి. కెనడా దౌత్యపరమైన ఉనికిని తగ్గించాలని భారత ప్రభుత్వం పట్టుబట్టవద్దని కోరాయి. ‘భారత్‌లో కెనడా తమ దౌత్యవేత్తలను తగ్గించాలని ఢిల్లీ ఆదేశించడం, ఈ మేరకు కెనడా తమ దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించడం ఆందోళన కలిగిస్తోంది.’ అని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు.
చదవండి: భారత్‌ చర్యతో లక్షల మంది జీవితాలు దుర్భరం: ట్రూడో

‘క్షేత్రస్థాయిలో విభేదాలను పరిష్కరించడానికి దౌత్యవేత్తలు అవసరం. దౌత్య సిబ్బందిని తగ్గించాలని పట్టుబడ్డవద్దని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే నిజ్జర్‌ హత్య విషయంలో కెనడా దర్యాప్తుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం భారత్‌ తన బాధ్యతలను నిలబెట్టుకుంటుందని  ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. 

కెనడా ఆరోపణలో తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. తామకు భారత్‌తో సంబంధాలు అత్యంత కీలమని చెబుతూ.. ఖలీస్తానీ ఉగ్రవాది హత్య విచారణలో కెనడాకు సహకరించాలని న్యూఢిల్లీపై ఒత్తిడి తెస్తున్నాయి. యూఎస్‌ బాటలోనే బ్రిటన్‌ నడుస్తోంది. కెనడా విషయంలో భారత్‌ వైఖరిని తప్పుబడుతూ శుక్రవారం బ్రిటన్‌ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

పదుల సంఖ్యలో కెనడా దౌత్యవేత్తలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మేము ఏకీభవించడం లేదని బ్రిటన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. కెనడా దౌత్య వేత్తల ఏకపక్ష తొలగింపు, వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణం కాదని అభిప్రాయపడింది

సిక్కు వేర్పాటువాది, కెనడా పౌరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కెనడాలోని మన దౌత్యవేత్తలను ఆ దేశం బహిష్కరించడం, బదులుగా దౌత్యపరమైన సంఖ్యను తగ్గించుకోవాలని భారత్‌ గత నెలలో కోరింది. భారత్ విధించిన డెడ్‌లైన్ ముగియడంతో కెనడా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. అంతేగాక చండీగఢ్, ముంబై, బెంగళూరు నగరాల్లోని కాన్సులేట్‌లలో వ్యక్తిగత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా శుక్రవారం తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement