వాషింగ్టన్: అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు న్యాయస్థానంలో తాత్కాలిక ఊరట లభించింది. మెయిల్ ఇన్ (తపాలా) ఓటింగ్పై పరిమితులు విధించేందుకు ఉద్దేశించిన ఆయన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల్లోని కీలక నిబంధనల అమలుకు యూఎస్ సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఈ మేరకు ట్రంప్ మార్చి 31 నాటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై గతంలో కింది కోర్టు విధించిన స్టేను ఎత్తివేస్తూ, అత్యున్నత న్యాయస్థానం 6-3 మెజారిటీతో నిర్ణయం వెలువరించింది. అయితే, ఈ ఉత్తర్వులు అంతిమంగా రాజ్యాంగబద్ధమైనవా కాదా అనే ప్రధాన అంశంపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి తుది తీర్పును ప్రకటించలేదు.
ట్రంప్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అర్హులైన ఓటర్ల జాబితాలను ఫెడరల్ ప్రభుత్వం రూపొందించాల్సి ఉంటుంది. ఆ జాబితాల్లో నమోదైన ఓటర్లకు మాత్రమే మెయిల్ ఇన్ లేదా పోస్టల్ బ్యాలెట్లను పంపిణీ చేయాలని అమెరికా పోస్టల్ సర్వీస్ను ఆదేశించారు. వీటితో పాటు బ్యాలెట్ కవర్లపై కొత్త ఫెడరల్ నిబంధనలు అమలు చేయాలని, అనర్హులకు బ్యాలెట్ పత్రాలు అందజేసే ఎన్నికల అధికారులపై దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే ఎన్నికల నిర్వహణ అధికారాలు ప్రధానంగా రాష్ట్రాలు, కాంగ్రెస్ పరిధిలోనే ఉంటాయని వాదిస్తూ డెమొక్రాట్ పాలిత రాష్ట్రాలు ఈ ఉత్తర్వులను న్యాయస్థానంలో సవాలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలువరించే పరిధి కింది కోర్టుకు లేదని పేర్కొంది. అదే సమయంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యా చట్టబద్ధమైనదని తాము ధ్రువీకరించడం లేదని, దానికి కాలమే సమాధానం చెబుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు నిర్ణయంపై డెమొక్రాట్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెనేట్ మైనారిటీ లీడర్ చక్ షూమర్ దీనిని అవమానకరం అని పేర్కొనగా, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ మరో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోస్టల్ సర్వీస్ అమలుకు సంబంధించిన మరో స్టే ఇంకా అమల్లో ఉన్నందున, ఈ వ్యవహారంలో న్యాయపోరాటం ఇంకా ముగియలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: హౌస్ఫుల్ బోర్డుల వెనుక అసలు వ్యూహం


