మళ్లీ దాడులకు సిద్ధమైన అమెరికా..! లాస్ట్‌ వార్నింగ్‌ వచ్చేసింది.. | US ready to resume military action if Iran violates deal | Sakshi
Sakshi News home page

మళ్లీ దాడులకు సిద్ధమైన అమెరికా..! లాస్ట్‌ వార్నింగ్‌ వచ్చేసింది..

Jun 18 2026 7:00 PM | Updated on Jun 18 2026 7:46 PM

 US ready to resume military action if Iran violates deal

బ్రస్సెల్స్‌: అమెరికా-ఇరాన్ ఒప్పందంలోని హామీలను ఇరాన్ పాటించకపోతే మళ్లీ సైనిక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ గురువారం తెలిపారు. నాటో రక్షణ మంత్రుల సమావేశం అనంతరం బ్రస్సెల్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఒప్పందం అమలు, చర్చల సమయంలో ఇరాన్ నిబంధనలు పాటించకపోతే ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. "ఈ చర్చల గడువులో ఇరాన్ చెప్పినట్టు చేయకపోతే, మేము మళ్లీ చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటామని అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇరాన్ నిబంధనలు పాటించకపోతే, అత్యంత కఠినమైన సముద్ర దిగ్బంధనాన్ని మళ్లీ అమలు చేసే సామర్థ్యం మాకు ఉంది" అని పీట్ హెగ్‌సెత్ అన్నారు.

అమెరికా-ఇరాన్‌ మధ్య 3 నెలలకు పైగా సాగిన ఘర్షణలకు ముగింపు పలికే లక్ష్యంతో ఇటీవల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందంలో శత్రుత్వానికి ముగింపు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల సడలింపు, ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత స్థాయి ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభించడం వంటి అంశాలు ఉన్నాయి.

ఇరాన్‌ బాధ్యతగా వ్యవహరిస్తేనే.. 
ఇరు పక్షాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించినప్పటికీ ఒప్పందం ద్వారా లభించే ఆంక్షల సడలింపు, ఇతర ప్రయోజనాల వంటివి ఇరాన్ తన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే అమల్లోకి వస్తాయని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

తాజా వ్యాఖ్యలతో, ఒప్పందం అమలు సమయంలో ఇరాన్ చర్యలను ట్రంప్ ప్రభుత్వం నిశితంగా పరిశీలించనున్నట్టు మరోసారి సంకేతాలు ఇచ్చింది. ఈ ఒప్పందాన్ని "పనితీరు ఆధారిత ఒప్పందం"గా పేర్కొంటున్నారు. ఇందులో ఆంక్షల సడలింపు, నిలిపివేసిన నిధుల విడుదల, ఇతర చర్యలు అన్నీ ఇరాన్‌ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటాయి.

అయితే ఇరాన్ నిధుల విడుదల, సముద్ర ఆంక్షల సడలింపు వంటి హామీలను ఏ క్రమంలో అమలు చేయాలనే విషయంలో రెండు పక్షాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. ఘర్షణల సమయంలో హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడటంతో ఇంధన మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయి. అనేక నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చింది.

ఈ ఒప్పందంతో ఆ ప్రాంతంలో సముద్ర రాకపోకలు సాధారణ స్థితికి వస్తాయని వాషింగ్టన్ భావిస్తోంది. అదే సమయంలో ఇరాన్ ఒప్పంద నిబంధనలు పాటించకపోతే, సైనిక, ఆర్థిక ఒత్తిడిని మళ్లీ తీసుకురావచ్చని అమెరికా స్పష్టం చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement