యెమెన్‌ పోర్టుపై మళ్లీ అమెరికా దాడులు | US airstrikes Yemen oil port held by Houthis | Sakshi
Sakshi News home page

యెమెన్‌ పోర్టుపై మళ్లీ అమెరికా దాడులు

Apr 21 2025 5:38 AM | Updated on Apr 21 2025 5:38 AM

US airstrikes Yemen oil port held by Houthis

సనా: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్ల మౌలిక వనరులే లక్ష్యంగా అమెరికా మరోసారి భీకర దాడులకు పాల్పడింది. హొడైడా నౌకాశ్రయం, విమానా శ్రయాలపై ఆదివారం 13 సార్లు అమెరికా వైమానిక దాడులు జరిపిందని హౌతీల అధీనంలో అల్‌ మసీరాహ్‌ టీవీ చానెల్‌ పేర్కొంది. హొడైడా ప్రావిన్స్‌లోనే ఉన్న రాస్‌ ఇసా పోర్టుపై అమెరికా రెండు రోజుల క్రితం చేపట్టిన దాడుల్లో 80 మంది మృతి చెందారు. 150 మందికి గాయాలయ్యాయి. 

అమెరికా బలగాలు శనివారం రాజధాని సనాలోని రెండు ప్రాంతాలపై జరిపిన దాడుల్లో ముగ్గురు చనిపోగా నలుగురు గాయపడినట్లు అల్‌ మసీరాహ్‌ తెలిపింది. అమెరికా ఎన్ని దాడులు చేసినా తాము వెనక్కి తగ్గేది లేదని హౌతీలు ప్రకటించారు. గాజాలోని పాలస్తీనియన్లకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రంలో ప్రయాణించే పశ్చిమదేశాల నౌకలపై హౌతీలు ఇప్పటివరకు 100కు పైగా దాడులు జరిపారు. దీంతో, హౌతీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజా దాడులకు శ్రీకారం చుట్టారు. 

ఈ దాడులపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాస్‌ ఇసా పోర్టుపై దాడి ఫలితంగా దెబ్బతిన్న ట్యాంక్‌ల నుంచి లీకైన చమురు ఎర్ర సముద్ర జలాలను కలుషితంగా మార్చే ప్రమాదముందన్నారు. ఈ దాడిలో ఐదుగురు ఐరాస సహాయక సిబ్బంది సైతం గాయపడ్డారన్నారు. యెమెన్‌ దిగుమతుల్లో 70 శాతం, మానవతాసాయంలో 80 శాతం రాస్‌ ఇసా, హొడైడా, అస్‌ సలీఫ్‌ పోర్టుల ద్వారానే జరుగుతుంటాయి. రాస్‌ ఇసాలో యెమెన్‌ ప్రధాన ఆయిల్‌ పైప్‌ లైన్‌కు టెర్మినస్‌తోపాటు, అత్యంత కీలక మౌలిక వనరులున్నాయని ఐరాస పేర్కొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement