ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాయి. అందులో భాగంగానే పిల్లలకు పోషకాహార పథకాలు మెుదలు.. స్కూళ్లలో మద్యాహ్న భోజనాలు లాంటి ఏన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే యూఏఈ మాత్రం మరో అడుగు ముందుకేసి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్య రక్షణకై కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా పిల్లలకు శీతల పానీయాలు, ఐస్క్రీములు, చాక్లెట్లు ఇతరత్రా తీపి పదార్థాలతో పాటు జంక్ ఫుడ్ ఇష్టం ఉంటాయి. అయితే ఆ వయసులో వాటి వల్ల కలిగే నష్టం వారికి తెలియదు. అందుకే వాటిని ఇష్టపడుతూ తింటుంటారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో క్రమశిక్షణను పెంచడంతో పాటు వారి ఆరోగ్య రక్షణకు యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఉండే క్యాంటీన్లతో పాటు పరిసర ప్రాంతాల్లో జంక్ ఫడ్స్ అమ్మకం నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా ఎటువంటి ఎనర్జీ డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్స్, కేకులు, డోనట్స్, నూడుల్స్ లాంటివి ఏవికూడా పాఠశాలల పరిసర ప్రాంతాలలో అమ్మకూడదని తెలిపింది. వాటితో పాటు పిల్లలకు వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇంటి నుంచే సమతుల్య ఆహరం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి పంపించాలని తెలిపింది. వీటితో పాటు ఎట్టిపరిస్థితుల్లో పిల్లలు పాఠశాలకు ఫోన్లు తీసుకరాకూడదని పేర్కొంది.
ఒకవేళ గనుక వారు మెుబైల్ ఫోన్లు పాఠశాలలకు తీసుకవస్తే మెుదటి సారి ఒక నెల వరకూ వారి ఫోన్ జప్తు చేయాలని తిరిగి అదే పునరావృతం అయితే విద్యా సంవత్సరం చివరి వరకూ మెుబైల్స్ స్వాధీన పరచుకోవాలని పేర్కొంది. అయితే పాఠశాల అనుమతుల ప్రకారం టాబ్స్, ఐప్యాడ్ లాంటివి వినియోగించవచ్చని పేర్కొంది. విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఏఈ విద్యాశాఖ ప్రకటించింది.


