వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానిపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతో ఫోన్లో ఆయనను తీవ్ర పదజాలంతో "అసలు నువ్వు ఏం చేస్తున్నావ్" హెచ్చరించినట్లు ఆక్సియోస్ కథనం ప్రచురించింది.
అమెరికా, ఇరాన్ల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరే దశకు వచ్చింది. అయితే, ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు పెంచడంతో.. "ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే అమెరికాతో చర్చలు నిలిపివేస్తాం" అని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ట్రంప్ నెతన్యాహూతో మాట్లాడి కాల్పులు విరమించాలని కోరారు. అయితే దీనికి తొలుత అంగీకరించిన ఇజ్రాయెల్ తిరిగి లెబనాన్పై కాల్పులు జరపింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నెతన్యాహూకు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డట్లు సమాచారం.
అమెరికా అధికారుల సమాచారం ప్రకారం.. ట్రంప్ చాలా కోపంగా నెతన్యాహును ఉద్దేశించి ఫోన్లో ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది" అసలు నువ్వు ఏం చేస్తున్నావు. నీకు పిచ్చి పట్టింది నేను గనుక లేకపోతే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతుంటే నువ్వు ఇలా చేస్తున్నావు.ఈ దాడుల వల్ల ప్రపంచంలో నిన్నూ, ఇజ్రాయెల్ను అందరూ అసహ్యించుకుంటున్నారు" అని నెతన్యాహుని తీవ్ర పదజాలంతో మందలించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.
అనంతరం ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో.. నెతన్యాహుతో మాట్లాడి బీరూట్పై పెద్ద ఎత్తున జరపాలనుకున్న దాడిని విరమించుకునేలా చేశానని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గిందని ప్రకటించారు. ఇందుకు నెతన్యాహుకు ధన్యవాదాలు కూడా తెలిపారు.
అయితే, నెతన్యాహు కార్యాలయం మాత్రం తాము పూర్తిగా వెనక్కి తగ్గినట్లు ఒప్పుకోలేదు. "హెజ్బుల్లా గనుక మా నగరాలపై దాడులు ఆపకపోతే.. మేము బీరూట్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి తీరుతాం. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు" అని నెతన్యాహు స్పష్టం చేశారు.


