
ప్రమాదాన్ని ముందే గుర్తించగల పరిజ్ఞానం
కార్బన్ డయాక్సైడ్తో రంగు మారుతున్న ఆకులు
అగ్నిపర్వతాలు ఎప్పుడు బద్ధలవుతాయో కచ్చితంగా గుర్తించగల పరిజ్ఞానం ఇప్పటిదాకా లేదు. ఇది తరచూ తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తోంది. అగ్నిపర్వతాల విస్ఫోటాన్ని ముందుగానే కనిపెట్టగల విధానాన్ని తాజాగా ఆవిష్కరించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ దిశగా కీలక ముందడుగు వేశారు. అగ్నిపర్వతం చుట్టుపక్కల ఉండే చెట్లూ చేమల ఆధారంగా అదెప్పుడు పేలేదీ ముందుగానే గుర్తించవచ్చని వారంటున్నారు.
అగ్నిపర్వతం పేలినప్పుడు శిలాద్రవం (మాగ్మా) వెలువడుతుందన్నది తెలిసిందే. మాగ్మా కంటే ముందే కార్బన్ డయాక్సైడ్ అధిక మోతాదుల్లో వెలువడుతుంది. దాన్ని పీల్చే చెట్ల ఆకుల రంగు మారిపోతుంది. అవి ముదురు ఆకుపచ్చ రంగును సంతరించుకుంటాయి. ఈ మార్పును స్పష్టంగా గమనించవచ్చు. అంతేగాక పేలుడుకు ముందు ఆ ప్రాంతంలో భూమి ఎత్తు హఠాత్తుగా పెరుగుతుంది. భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ అగ్నిపర్వతం పేలుడుకు సంకేతాలేనని నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఉపగ్రహాలతో విశ్లేషణ
అగ్నిపర్వతాలపై కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను గుర్తించాలంటే సైంటిస్టులు ఆ పర్వతాలపైకి చేరుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే తక్కువ స్థాయిలో వెలువడే కార్బన్ డయాక్సైడ్ను ఉపగ్రహ చిత్రాల ద్వారా అంచనా వేయడం సాధ్యం కాదు. కానీ ఇది చాలాసార్లు ప్రమాదకరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలు ఇకపై దూరమైనట్లే. ఎందుకంటే చెట్ల ఆకుల రంగు ద్వారా అగ్నిపర్వతాల పేలుడును కచ్చితంగా గుర్తించగలమని సైంటిస్టులు పేర్కొంటున్నారు.
ఈ రకమైన విశ్లేషణకు ఎన్నో రకాల శాటిటైట్లు అందుబాటులో ఉన్నాయని టెక్సస్లోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్లో వోల్కనాలజీ డాక్టోరల్ విద్యార్థి నికోల్ గిన్ చెప్పారు. ఇటలీలో సిసిలీ తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతంతోపాటు సమీపంలోని చెట్టూచేమల చిత్రాలను లాండ్శాట్ 8, టెరా శాటిలైట్, సెంటినెల్–2తోపాటు ఇతర ఎర్త్–అబ్జర్వింగ్ ఉపగ్రహాల ద్వారా సేకరించారు. వాటిని సమగ్రంగా విశ్లేషించారు. అక్కడ అధిక కార్బన్ డయాక్సైడ్తో చెట్ల ఆకుల రంగు మారినట్లు కనిపెట్టారు. ఈ అగ్నిపర్వతం నుంచి మాగ్మా ప్రవాహం మొదలైంది.
→ ప్రపంచ జనాభాలో 10 శాతం అగ్నిపర్వతాలకు కొన్ని మైళ్ల దూరంలోనే నివసిస్తోంది.
→ అగ్నిపర్వతాల పేలుడు గురించి ముందే తెలియక చాలా సందర్భాల్లో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తున్నాయి.
→ చెట్ల ఆకుల రంగు ద్వారా పేలుడును సామాన్యులు సైతం ముందే కనిపెట్టవచ్చని సైంటిస్టులు అంటున్నారు. తద్వారా ప్రాణాపాయం నుంచి సులువుగా బయటపడొచ్చని సూచిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్