
రాజకీయ అస్థిరతను పారద్రోలి సుస్ధిర పాలనపై దృష్టి
ఉత్తర కొరియాతో శత్రుత్వం తగ్గించుకునేందుకు కృషి
అమెరికా, జపాన్లతో సత్సంబంధాల బలోపేతం దిశగా అడుగులు దక్షిణ కొరియాలో నెలల తరబడి కొనసాగుతున్న రాజకీయ సంక్షోభాన్ని, అధికార అస్థిరతకు చరమగీతం పాడుతూ అధికార పగ్గాలు చేపట్టబోతున్న నూతన అధ్యక్షుడు లీ జే మ్యుంగ్కు ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఉత్తర కొరియాతో చిరకాల వైరానికి స్వస్తి పలికి చర్చలు, దౌత్యంతో కొరియా ద్వీపకల్పంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుతానని బుధవారం మ్యుంగ్ ఉద్ఘాటించారు. దేశంలో అసమానతలను పారద్రోలి అవినీతిపై యుద్ధం చేస్తానని ఆయన అన్నారు.
దేశంలో మార్షల్ లా విధించి చివరకు పదవీచ్యుతుడైన యూన్ సుక్ యోల్ స్థానంలో అధ్యక్ష పీఠంపై ఆసీనులైన మ్యుంగ్ దేశాన్ని ఏ స్థాయిలో జనరంజకంగా పాలిస్తారనే అంచనాలు, విశ్లేషణలు ఫలితాలు వెలువడిన వెనువెంటనే వెల్లువెత్తాయి. దాడికి రంకెలేస్తున్న ఉ.కొరియాతో మైత్రి, అమెరికా, జపాన్ మిత్రదేశాలతో సత్సంబంధాల మెరుగు, ఆర్థికవ్యవస్థను ఉరకలెత్తించడం, ట్రంప్తో దిగుమతి టారిఫ్ల పోరులో నెగ్గడంసహా ఎన్నో అంశాలను మ్యుంగ్ ఏపాటి సమర్థవంతంగా పరిష్కారాల దిశగా లాక్కొస్తారనే మీమాంస సగటు ద.కొరియన్ పౌరుడిలో మొదలైంది.
ఆర్థికాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి
కొన్ని నెలలుగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడంపై తొలుత మ్యుంగ్ దృష్టిసారించనున్నారు. రాజకీయ అస్థిరత కారణంగా తమ పెట్టుబడులకు రక్షణ కరువవుతుందనే అనుమానాలు ఎక్కువవడంతో విదేశీ పెట్టుబడులు తగ్గిపోయాయి. దీనికితోడు వినియోగదారుల వినిమయం సైతం బాగా తగ్గిపోయింది. యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ట్రంప్ ద.కొరియాపై అధిక టారిఫ్ల మోత మోగిస్తాననడం సైతం దేశానికి శరాఘాతమైంది.
వీటన్నింటికీ మ్యుంగ్ పరిష్కారాలు వెతకాల్సి ఉంది. ట్రంప్ విధించిన కొత్త పన్నుల అమలుకు 90 రోజుల విరామ గడువు జూలై 9వ తేదీతో ముగుస్తుంది. ఈలోపు ట్రంప్తో మ్యుంగ్ చర్చలు జరిపి టారిఫ్ల భారాన్ని తగ్గించుకోవాల్సి ఉంది. మరోవైపు తమ దేశంలో తిష్టవేసిన 28,000 మంది అమెరికన్ సైనికులకు జీతాలు, ఆయుధాలు మాత్రమే ట్రంప్ సర్కార్ సమకూర్చుతుంది. మిగతా సకల సౌకర్యాల ఖర్చు ద.కొరియానే భరిస్తోంది. ఈ భారం తగ్గించాల్సిన బాధ్యత ఇప్పుడు మ్యుంగ్ భుజస్కంధాలపై పడింది.
ఉత్తర కొరియాతో దోస్తీకీ సై
కొరియా ద్వీపకల్పంలో శాంతిస్థాపనే ధ్యేయంగా మ్యుంగ్ తానే ఒక అడుగు ముందుకేయాల్సి ఉంది. తమపై అమెరికా వేలాడదీసిన ఆర్థిక ఆంక్షల కత్తిని తొలగించేదాకా చర్చలు ఉండబోవని గతంలోనే ఉ.కొరియా తెగేసి చెప్పింది. ఈనేపథ్యంలో అమెరికాతో దౌత్యం నెరిపి నార్త్కొరియాను నేస్తంగా మార్చుకోవాల్సిన బాధ్యత సైతం మ్యుంగ్పై ఉంది.
సంప్రతింపుల మార్గాన్ని తెరుస్తానని బుధవారం మ్యుంగ్ ప్రకటించారు. మాజీ మంత్రి లీ జోంగ్ సియోగ్ను నిఘా చీఫ్గా నియమించారు. ఈయనకు గతంలో ఉ.కొరియాతో ద్వైపాక్షిక, శాంతి చర్చలు జరిపిన అపార అనుభవం ఉంది. ఉ.కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్తో శిఖరాగ్ర భేటీ వెంటనే సుసాధ్యంకాకపోయినా భవిష్యత్తులో నేరుగా మంతనాలకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మ్యుంగ్ చెప్పారు. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు ఉ.కొరియా భారీగా సైనిక,ఆయుధ సాయం చేసిన నేపథ్యంలో రష్యా ద్వారా దౌత్యం జరిపేందుకు సైతం మ్యుంగ్ ప్రయతి్నంచే వీలుంది.
త్రైపాక్షిక సంబంధాల బలోపేతం
అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థను తమ భూభాగంలో నెలకొల్పడం ద్వారా ఇరు కొరియాల మధ్య అమెరికా కయ్యాన్ని పెంచుతోందని మ్యుంగ్ గతంలో పలుమార్లు ఆరోపించారు. అమెరికా, జపాన్లంటే మ్యుంగ్కు అస్సలు నచ్చదని గతంలో చాలా సార్లు వార్తలొచ్చాయి. ఇప్పుడీ అపవాదును పోగొట్టుకుని ‘వాషింగ్టన్–సియోల్–టోక్యో’ త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని మ్యుంగ్ చెప్పారు.
చైనా, రష్యాలతోనూ ఘర్షణాత్మక వైఖరులను మ్యుంగ్ విడనాడాల్సిన తరుణం ఆసన్నమైంది. మ్యుంగ్తో త్వరలోనే ద్వైపాక్షి చర్చలు జరుపుతానని జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా బుధవారం చెప్పారు. దీంతో జపాన్తో సత్సంబంధాలు మరింత మెరుగయ్యే వీలుంది. టారిఫ్లు పెంచుతానన్న ట్రంప్తో నేరుగా మాట్లాడే నేతలేక గత కొద్దివారాలుగా ద.కొరియా తెగ ఇబ్బందులు పడింది. కొత్తగా అధికారం చేపట్టిన మ్యుంగ్ తక్షణం ట్రంప్తో చర్చలు జరిపి టారిఫ్ల భారం తగ్గించాల్సి ఉంది.
సొంతింటి ప్రక్షాళన..
మార్షల్ లా తదనంతర పరిణామాల్లో విపక్ష పీపుల్ పవర్ పార్టీపై కక్ష తీర్చుకోకుండా మ్యుంగ్ సంయమనం పాటించాల్సిన తరుణమిది. గత మూడేళ్లు అధికారంలో ఉన్న పీపీపీ పార్టీపై అక్రమ కేసులు బనాయిస్తూపోతే దేశంలో మళ్లీ నిరసనలు, ఆందోళనలు మొదలై శాంతిభద్రతల పరిరక్షణ పెద్ద సమస్యగా మారొచ్చు. ఇది మ్యుంగ్కు కొత్త తలనొప్పులు తేవొచ్చు. రాజకీయ కక్ష సాధింపు విషయంలో మ్యుంగ్ వైఖరి ఇంకా తెలియాల్సి ఉంది. విపక్ష పార్టీల నేతలపై దేశంలో తిరుగుబాటు వంటి తీవ్రమైన అభియోగాల్లో శిక్షలు పడే వీలుండటంతో నిరసనలు జరిగే వీలుంది. వీటిని మ్యుంగ్ ఏ స్థాయిలో ఎదుర్కొంటారో చూడాలి. యూన్ మార్షల్ లా ఘటనపై సమగ్ర దర్యాప్తునకు మాత్రం ఆదేశిస్తానని మ్యుంగ్ చెప్పారు.
శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ
ద.కొరియా నూతన అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన మ్యుంగ్కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అయ్యేందుకు మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని మోదీ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. –సాక్షి నేషనల్ డెస్క్
పేద కార్మికుడి నుంచి పగ్గాలు చేపట్టేదాకా..
60 ఏళ్ల మ్యుంగ్ 14 ఏళ్ల వయసులో పేదరికంలో మగ్గిపోతూ పరిశ్రమలో బాలకార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించారు. మ్యుంగ్ సియోల్ నగర దగ్గర్లోని ఆండోంగ్ పర్వతమయ గ్రామంలో 1963 డిసెంబర్ 8న జని్మంచారు. వాళ్ల తల్లిదండ్రుల ఏడుగురు సంతానంలో మ్యుంగ్ ఐదోవాడు. మ్యుంగ్ తండ్రి పట్టణంలో దు కాణాల సముదాయాలను శుభ్రం చేసేవారు. సామూహిక స్నానాల గదుల వద్ద తల్లి రుసుములను వసూలుచేస్తూ జీవించేవారు. మ్యుంగ్ అక్రమంగా బాలకార్మికునిగా ఆభరణాల తయారీ పరిశ్రమలో, రిఫ్రెజిరేటర్ల అసెంబ్లీ విభాగాల్లో సైతం పనిచేశాడు. ఆ సమయంలో ఫ్యాక్టరీ మెషీన్లో పడి ఎడమ చేయి మణికట్టును పూర్తిగా కోల్పోయారు. దీంతో పనిచేయడం కుదరక మళ్లీ చదువు బాటపట్టాడు.
1986లో చుంగ్ఆంగ్ ప్రైవేట్ లా వర్సిటీలో న్యాయపట్టా సాధించారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు మానవహక్కుల కేసులను వాదిస్తూ మంచి లాయర్గా పేరు తెచ్చుకున్నారు. 2005లో రాజకీయాల్లో చేరారు. సామాజిక ఉదారవాద ఊరీ పార్టీలో చేరారు. 2010లో సియాంగ్నమ్ నగర మేయర్గా గెలుపొందారు. 2018లో అతిపెద్ద గియోంగీ ప్రావిన్స్కు గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. 2021 అక్టోబర్లో కొద్దిలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవిని కోల్పోయినా ఏడాది తిరిగేలోపే పార్టీ పగ్గాలు చేపట్టారు. 2024 జనవరిలో బుసాన్ సిటీలో ప్రజాకార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక ఆగంతకుడు మెడపై పొడిచి చంపబోయాడు. సర్జరీ తర్వాత ఈయన కోలుకున్నారు. తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.