
కైవ్: రష్యా మరోమారు ఉక్రెయిన్పై భీకర దాడులకు దిగింది. రాజధాని కైవ్ను లక్ష్యంగా చేసుకుని, ఇక్కడి ఒడెసాలోని ఒక ఆస్పత్రిలోని ప్రసూతివార్డుపై డ్రోన్లతో దాడి చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ మీడియాకు తెలిపింది. దీనికిముందు కూడా ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లతో భారీ దాడులకు తెగబడింది. ఉక్రెయిన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిగా రష్యా వరుస దాడులను కొనసాగిస్తోంది.
శత్రు డ్రోన్లు నగరంలోని అనేక జిల్లాలపై ఒకేసారి దాడి చేస్తున్నాయని కైవ్ సైనిక పరిపాలన అధికారి తైమూర్ త్కాచెంకో టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో తెలిపారు. నివాస భవనాలను మంటలు చుట్టుముట్టాయని, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలంలో సేవలు అందిస్తున్నారని అన్నారు. దక్షిణ ఒడెసా ఓడరేవులో భారీ డ్రోన్ దాడి జరిగిందని, అలాగే అత్యవసర వైద్య భవనం, ప్రసూతి వార్డుతో పాటు నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని, డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయని ఒడెసా ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ కైపర్ టెలిగ్రామ్లో తెలిపారు. ప్రసూతి ఆసుపత్రిపై జరిగిన దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, బాధితులు, సిబ్బంది అప్రమత్తమై ముందుగా భవనాన్ని ఖాళీ చేశారని తెలిపారు. అయితే భవనం ధ్వంసమయ్యిందని పేర్కొంటూ, దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్పై రష్యా ప్రారంభించిన ఈ యుద్ధంలో వేలాదిమంది పౌరులు మరణించారు. వారిలో అధిక శాతం ఉక్రేనియన్లు ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఎనిమిది నిమిషాలు చనిపోయి.. ఏమైందో చెప్పిన మహిళ