
కొలరాడో: మృత్యువు అనేది ఒక అంతుచిక్కని రహస్యం. జననం ఆవలి మరణంలో ఏముందో తెలుసుకోవాలని మనిషి కొన్ని వేల ఏళ్ల తరబడి ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే పలు ఊహాగానాలు పుట్టుకువస్తున్నాయి. అయితే వీటికి స్పష్టమైన ఆధారాలు ఉండటం లేదు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ ‘స్ఫృహ’కు ఆవతలివైపు ఏముందో చూశానని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
కొలరాడోకి చెందిన బ్రియానా లాఫెర్టీ(33) తాను నిర్జీవ శరీరంతో తేలుతూ కాలం తెలియని లోకంలోకి ప్రవేశించానని చెప్పింది. ఆమె మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించిన ఎనిమిది నిముషాల తరువాత ఆమె లేచి కూర్చుని, తనకు ఇంతలో ఏమి జరిగిందో వివరించింది. చివరిసారిగా తనకు ‘సిద్ధంగా ఉన్నారా’? అనే మాట వినిపించిందని లాఫెర్టీ తెలిపారు. ఆ తర్వాత అంతా చీకటిగా మారిందన్నారు. ‘మరణం ఒక భ్రమ? ఆత్మ ఎన్నటికీ చనిపోదు. మన స్పృహ సజీవంగా ఉంటుంది. అది రూపాంతరం చెందుతుంది. మరణానంతర జీవితంలోనూ నా ఆలోచనలు కొనసాగాయి. అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను చూస్తాయని నేను గ్రహించాను. ఇది ఒక వరం’ అని లాఫెర్టీ ‘ది మిర్రర్’కు చెప్పారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఆ సమయంలో నేను అకస్మాత్తుగా నా భౌతిక శరీరం నుండి విడిపోయాను. నేను అప్పటి నా మానవ స్వభావాన్ని చూడలేదు. గుర్తుంచుకోలేదు. నేను పూర్తి నిశ్చలంగా ఉన్నాను. సజీవంగా, అవగాహనతో, గతంలో కంటే అధిక ప్రశాంతతను అనుభూతి చెందాను. ఎటువంటి నొప్పీలేదు. కేవలం ప్రశాంతత, స్పష్టత మాత్రమే ఉంది. ఆ సమయంలో మన భూసంబంధమైన ఉనికి అంతం కాదని కనుగొన్నాను. అక్కడ మనకంటే ఉన్నతమైన ఉనికి, తెలివితేటలు ఉన్నాయి. అవి బేషరతు ప్రేమతో మనల్ని ముందుకు నడిపిస్తాయి. అక్కడ సమయం అనేది లేదు. అయినప్పటికీ అంతా పరిపూర్ణంగా ఉంది’ అని లాఫెర్టీ తెలిపారు.
నిజానికి మరణానికి దగ్గరగా ఉన్న అనుభవాలు సంక్లిష్టమైనవి. వాటిని వివరించడం కష్టం అని అంటుంటారు. కానీ శాస్త్రవేత్తలు వాటిని అర్థం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2022లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మానవ మెదడు మరణం అంచుకు చేరినప్పడు, జీవితంలో ముఖ్య ఘట్టాలను గుర్తుచేసుకుంటుంది. ఇటీవల కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల్లో జీవులన్నీ జీవితాంతం తమ చుట్టూ ఒక కాంతిని వెదజల్లుతాయని, అయితే ఆ జీవి చనిపోయినప్పుడు ఆ కాంతి అదృశ్యమవుతుందని వెల్లడయ్యింది.
ఇది కూడా చదవండి: రాజ్తో సంబంధం.. రాజాతో పెళ్లి?.. ‘హనీమూన్ జంట’కథలో అసలు నిజం